దశలవారీగా గొల్లపల్లి మండల కేంద్ర సమస్యల పరిష్కారం..
గొల్లపల్లి:
గొల్లపల్లి మండల కేంద్రంలోని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బుధవారం గొల్లపల్లి మండల కేంద్రంలోని నల్లగుట్ట ప్రజల సౌకర్యం కోసం నూతన రేషన్ స్టాక్ పాయింట్ ను మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం నల్లగుట్టలో నూతన రేషన్ షాప్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరిగిందని మంత్రి అన్నారు. త్వరలోనే బయోమెట్రిక్ ద్వారా పూర్తిస్థాయి రేషన్ దుకాణం ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.

ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి పేద ప్రజలు సన్న బియ్యం తినాలని ఆలోచనతో రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేయడం జరిగిందని మంత్రి తెలిపారు.

గొల్లపల్లి మండల కేంద్రంలోని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా గొల్లపల్లిలో యువత కోసం నూతన స్టేడియం నిర్మాణం చేస్తామని, స్మశాన వాటిక రోడ్డు పనులు పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మండల కేంద్రంలో నిలిచిపోయిన సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.