ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి:
సామాజిక న్యాయం, వివక్ష లేని సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేటులోని సమావేశ మందిరంలో తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, జిల్లా అధికారులు, సిబ్బందితో కలిసి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ సామాజికపరంగా, వివక్షతో కూడిన సమాజంలో మార్పు రావాలన్న సదుద్దేశంతో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ సమానత్వం, న్యాయం, గౌరవం కోసం నిలబడాలని, ఏ రూపంలోనైనా అన్యాయని ఎప్పుడూ సమర్ధించవద్దని కలెక్టర్ సూచించారు. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో విలువలతో కూడిన రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందని, రాజ్యాంగ సూత్రాలను సమర్థిస్తూ న్యాయమైన, సామరస్య పూర్వకమైన, సాధికారత కలిగిన తెలంగాణ భారతదేశ కోసం కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల వ్యయ పరిశీలకులు రమేష్, జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వరి, డిఆర్ఓ మంగీలాల్, ఆర్డీఓ వాసు చంద్ర, డిబిసిడిఓ మాధవ రెడ్డిలతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.