Take a fresh look at your lifestyle.

జనంసాక్షి ఎడిటర్ పై కేసు ఎత్తివేయాలి

  • అదనపు డీజిపి, ఐజీలకు టీయుడబ్ల్యూజే వినతి.

ముద్ర, తెలంగాణ బ్యూరో : జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్‌ ఫ్యాక్టరీ దుష్ప్రభావాలపై వరస కథనాలను ప్రచురించిన జనంసాక్షి పత్రిక ఎడిటర్ ఎం.ఎం.రహమాన్ పై రాజోలీ పోలీసులు నమోదు చేసిన కేసును వెంటనే ఉపసంహరించు కోవాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) కోరింది. గురువారం టీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ నేతృత్వంలో ప్రతినిధి బృందం, అదనపు డీజిపి (శాంతి భద్రతలు) మహేష్ భగవత్, మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణలను కలిసి వినతి పత్రాలు అందించింది.ఈ సందర్బంగా విరాహత్ అలీ మాట్లాడుతూ, జనంసాక్షి పత్రిక ఎడిటర్‌ రహమాన్‌ గద్వాల జిల్లాకు చెందడంతో ఆ ప్రాంతంతో ఆయనకు అనుబంధం ఉందన్నారు.ఈ నేపథ్యంలోనే ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ గత ఎనిమిది నెలలుగా ఆ ప్రాంత రైతులు చేస్తున్న పోరాటాల్ని జనంసాక్షి పత్రిక వరుస కథనాలు రాసిందని ఆయన తెలిపారు. పెద్దధన్వాడలో రైతులు ఆందోళన చేసిన రోజు అనగా జూన్‌ 4న, రహమాన్‌ హైదరాబాద్‌లోనే ఉన్నాడని, ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఓ పరీక్షా కేంద్రంలో హిస్టరీ సబ్జెక్టు పరీక్షను కూడా రాశాడని విరాహత్ పేర్కొంటూ.. హాల్ టిక్కెట్ ను సాక్ష్యంగా చూపించారు.అంతేకాకుండా గతంలో పెద్దధన్వాడలో జరిగిన ప్రత్యక్ష ఆందోళనలలో ఏనాడూ రహమాన్‌ పాల్గొనలేదన్నారు. కేవలం అక్కడి రైతులు చేసిన ఆందోళనలకు సంబంధించి జనంసాక్షి పత్రిక నిత్యం కథనాలను ప్రచురించిందని, దీనిపై అక్కసు పెంచుకున్న ఫ్యాక్టరీ యాజమాన్యం, ఎడిటర్‌ రహమాన్‌ను ప్రధాన నిందితుల జాబితాలో చేర్చడం భావ ప్రకటన, పత్రికా స్వేచ్ఛకు గొడ్డలి పెట్టులాంటిదిగా భావిస్తున్నామన్నారు. ఉద్దేశపూర్వకంగా ఫ్యాక్టరీ యాజమాన్యం ఏ2 నిందితుడిగా రహమాన్‌ను చేర్చడం విచారకరమన్నారు. జనంసాక్షి ఎడిటర్‌పై నమోదైన 30 సెక్షన్లను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. ఫ్యాక్టరీ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి విచారణ జరపకుండా జనంసాక్షి ఎడిటర్‌పై అక్రమంగా కేసులు నమోదు చేసిన రాజోలి ఎస్సై జగదీశ్‌పై చర్యలు తీసుకోవాలని విరాహత్ అలీ డిమాండ్‌ చేసారు.పోలీసు ఉన్నతాధికారులను కలిసిన ప్రతినిధి బృందంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి కల్కూరి రాములు, రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రాజేశ్వరి, హెచ్.యూ.జే అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్ లు ఉన్నారు.

  • విచారణకు ఆదేశాలు.

టీయూడబ్ల్యూజే సమర్పించిన వినతిపత్రంపై అదనపు డీజిపి మహేష్ భగవత్, ఐజీ వి. సత్యనారాయణలు స్పందించారు. వెంటనే విచారణ జరిపించి తగు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.