గ్రేటర్ కార్పోరేషన్ ఎన్నికలపై వ్యూహాత్మక ప్రణాళిక – మూడు విడివిడిగా ఎన్నికలు, ఫలితాల ఆధారంగా వ్యూహాలు
అదును చూసి అడుగులు
గ్రేటర్ కార్పోరేషన్ ఎన్నికలపై మాస్టర్ ప్లాన్
మూడు ఒకే సారి కాదు..విడివిడిగానే..
గ్రేటర్ కార్పొరేషన్లలో పట్టు కోసం ప్రయత్నాలు
ఒక్కొక్కటిగా ఫలితాలను బట్టి గెలుపు వ్యూహాలు
ముద్ర, తెలంగాణ బ్యూరో:
గ్రేటర్ కార్పోరేషన్ ఎన్నికలపై రేవంత్ టీం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించిన ప్రభుత్వం.. వాటికి ఎన్నికలు మాత్రం ఒకే సారి పెట్టాలనుకోవడం లేదు. విడివిడిగా ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. గ్రేటర్ ఫలితాలను బట్టి ఒక్కో చోట తమ రాజకీయ వ్యూహాలను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
కొత్తగా విభజన.. అదే స్థాయిలో ఎన్నికల వ్యూహాలు
హైదరాబాద్ మహానగర పాలనలో కొత్త అధ్యాయం మొదలైంది. జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పటికే అమలులోకి వచ్చింది. ముగ్గురు కమిషనర్ల నియామకం కూడా పూర్తి కావడంతో, ఇప్పుడు అందరి దృష్టి ఎన్నికల నిర్వహణపై పడింది. అయితే, మూడు కార్పొరేషన్లకు ఒకేసారి కాకుండా, ఒక్కో కార్పొరేషన్కు విడివిడిగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.ఇలా చేయడానికి లోతైన రాజకీయ వ్యూహం ఉన్నట్లుగా చెబుతున్నారు.
రాజకీయ వార్డుల పునర్విభజన..?
ప్రస్తుతం ఒక్కో మున్సిపల్ కార్పొరేషన్ లో వంద వార్డులు ఉన్నాయి. అయితే వాటిని మార్చాలనుకుంటున్నారు. వార్డుల సంఖ్యను పెంచడం ద్వారా ఏ ఒక్క రాజకీయ పార్టీకి ఏకపక్షంగా పట్టు చిక్కకుండా చేయాలన్నది సర్కార్ ఆలోచనగా చెబుతున్నారు. గ్రేటర్ పరిధిలోని బలమైన ఓటు బ్యాంకులను ముక్కలు చేయడం ద్వారా రాజకీయ శక్తిని వికేంద్రీకరించాలని చూస్తోంది. ఈ వార్డుల పునర్విభజన ఫలితాలే రాబోయే రోజుల్లో కొత్తగా ఏర్పడిన మూడు కార్పొరేషన్ల మేయర్ పీఠాలను ఎవరు అధిరోహించాలనేది నిర్ణయించేలా చేయాలనుకుంటున్నారు.
కాంగ్రెస్ బలహీనతలే వ్యూహాలకు మూలమా?
మల్కాజ్గిరి వంటి కీలక ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో ఇంకా పటిష్టమైన యంత్రాంగం సిద్ధం కాలేదు. అక్కడ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఇప్పటికీ బలంగా ఉండటం అధికార పార్టీకి కొంత ఆందోళన కలిగిస్తోంది. ఒకేసారి ఎన్నికలకు వెళ్తే ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం ఉందని గ్రహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అనుకూలమైన చోట ముందుగా, ప్రతికూలత ఉన్న చోట నిదానంగా ఎన్నికలు నిర్వహించడం ద్వారా నష్ట నివారణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
సైబరాబాద్ సెటిలర్ల ఓట్లు – గెలుపు గుర్రం ఎవరిది?
కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ వంటి చోట్ల ఆంధ్ర మూలాలున్న ఓటర్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో రాజకీయ సమీకరణాలు ఎప్పుడూ భిన్నంగానే ఉంటాయి. ఈ ప్రాంతాల్లో గెలుపు ఏ పార్టీకైనా ప్రతిష్టాత్మకమే. అందుకే, తక్షణమే ఎన్నికలకు వెళ్లకుండా, అక్కడి ఓటర్లను ఆకట్టుకునేలా ప్రత్యేక అభివృద్ధి పథకాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. సైబరాబాద్ పరిధిలో మౌలిక వసతుల కల్పన ద్వారా వారి విశ్వాసాన్ని పొందాకే ఎన్నికల బరిలోకి దిగాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల వ్యూహంలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి మూడు కార్పొరేషన్ల పరిధిలో 99 రోజుల ప్రత్యేక అభివృద్ధి కార్యాచరణను ప్రకటించారు. ఈ స్వల్ప కాలంలో పెండింగ్లో ఉన్న కీలక ప్రాజెక్టులను పూర్తి చేసి, ఆపై భారీ స్థాయిలో ప్రారంభోత్సవాల ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్నారు. ఒకవైపు పాలనను వికేంద్రీకరిస్తూనే, మరోవైపు అభివృద్ధి పనులతో ప్రత్యర్థుల విమర్శలకు చెక్ పెట్టాలనేది ప్రభుత్వ ఎత్తుగడగా కనిపిస్తోంది.
విడివిడి ఎన్నికల వెనుక అసలు లెక్కలు
మూడు కార్పొరేషన్లకు వేర్వేరు సమయాల్లో ఎన్నికలు జరపడం ద్వారా.. ఒక ప్రాంతంలో వచ్చిన ఫలితం లేదా ప్రభావాన్ని మరో ప్రాంతంలో తమకు అనుకూలంగా మార్చుకోవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. ఇది ప్రతిపక్షాల ఏకాగ్రతను దెబ్బతీయడంతో పాటు, అధికార యంత్రాంగాన్ని ఒకే చోట కేంద్రీకరించి గెలుపు అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి దోహదపడుతుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. భాగ్యనగర త్రిశూల వ్యూహంతో మేయర్ పీఠాలను దక్కించుకోవడానికి రేవంత్ రెడ్డి భారీ స్కెచ్ సిద్ధం చేసినట్లు స్పష్టమవుతోంది. ఎంత మేర వర్కవుట్ అవుతాయన్నది వేచి చూడాల్సిందే.