ప్రముఖ ఎన్ఆర్ఐ కాసర్ల నాగేందర్ రెడ్డికి “బెస్ట్ ఎన్ఆర్ఐ అవార్డు” కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా ప్రధానం
ముద్ర, కరీంనగర్ :
ఏఎన్ఎన్ – మహా అవార్డ్స్ 2026 కార్యక్రమంలో ఆస్ట్రేలియాలో స్థిరపడిన ప్రముఖ ఎన్ఆర్ఐ శ్రీ కాసర్ల నాగేందర్ రెడ్డికి “బెస్ట్ ఎన్ఆర్ఐ అవార్డు” ప్రదానం చేయబడింది. ఆయన చేసిన సామాజిక సేవలు, కమ్యూనిటీ సేవలు, మేధోపరమైన కృషి, అలాగే సామాజిక సమస్యలపై రాసిన వ్యాసాలు (కాలమ్స్)కు గాను ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందించారు.
నాగేందర్ రెడ్డి గతంలో కూడా అనేకసార్లు “బెస్ట్ ఎన్ఆర్ఐ” అవార్డులను అందుకుని తన ప్రతిభను, సేవాభావాన్ని నిరూపించుకున్నారు. గత సంవత్సరం ఆస్ట్రేలియాలో జరిగిన ఓటింగ్లో అత్యధిక ఓట్లు సాధించి “బెస్ట్ కమ్యూనిటీ లీడర్”గా గుర్తింపు పొందారు. అంతకుముందు సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఓటింగ్లో అత్యధిక ఓట్లు సాధించి “బెస్ట్ ఎన్ఆర్ఐ”గా నిలిచారు.
గత రెండు దశాబ్దాలుగా ఆయన వేలాది అంతర్జాతీయ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు, నివాస సదుపాయాలు కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. విదేశాలలో మరణించిన వారి మృతదేహాలను స్వదేశానికి పంపించేందుకు (రిపాట్రియేషన్ సేవలు) కూడా నిరంతరం సేవలందిస్తున్నారు.
ఈ అవార్డును భారత కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి గారు నాగేందర్ రెడ్డికి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన సేవలను పలువురు ప్రముఖులు అభినందిస్తూ, సమాజానికి ఆయన చేస్తున్న సేవలు మరింత మందికి ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు.