హైదరాబాద్కు ట్రాఫిక్ ఫ్రీ జర్నీ: ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణతో నగర రూపురేఖలు మారుస్తాం – సీఎం రేవంత్ రెడ్డి
సిటీ మధ్య నుంచి అన్ని ప్రాంతాలకు ఎలివేటెడ్ కారిడార్లు
హైదరాబాద్ను అద్భుత నగరంగా తీర్చిదిద్దుతాం
మెట్రో విస్తరణకు ఎల్ అండీ టీ ముందుకు రాలేదు
మండలిలో సీఎం రేవంత్ రెడ్డి సిటీ ప్లాన్
ముద్ర, తెలంగాణ బ్యూరో :
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఫ్రీ జర్నీ అందించటమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఈ మేరకు నగరం నడిబొడ్డు నుంచి అన్ని ప్రాంతాలకు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే శామీర్పేట, మేడ్చల్ వైపు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తున్నామన్నారు. పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా మెట్రో సేవలను కూడా విస్తరిస్తామన్నారు. కొత్తగా మరో 76 కి.మీ మేర మెట్రోను విస్తరించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. హైదరాబాద్ను అద్భుత నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
హైదరాబాద్ను అద్భుత నగరంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. సిటీ మధ్య నుంచి అన్ని ప్రాంతాలకు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తామని వీటి నిర్మాణం ద్వారా నగర రూపు రేఖలు పూర్తిగా మారిపోతాయని అన్నారు. నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చిన సీఎం.. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ బాగా పెరిగిందన్నారు. ఎక్కడా ట్రాఫిక్ ఆగకూడదనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రోడ్లను అండర్పాస్లు, సర్ఫేస్, ఎలివేటెడ్ కారిడార్లుగా విభజించామన్నారు. శామీర్పేట, మేడ్చల్ వైపు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తామన్నారు. ఎలివేటెడ్ కారిడార్ల కోసం కేంద్ర సంస్థలతో మాట్లాడి భూమి తీసుకుంటున్నామన్నారు. బేగంపేట వద్ద పైన విమానాలు ఎగిరితే.. కింద అండర్పాస్ టన్నెల్ వస్తోందన్నారు.
హైదరాబాద్ చారిత్రక నగరమని అనేక గొప్ప కట్టడాలు ఉన్నాయన్నారు. మానవ తప్పిదాల వల్లే ఇవాళ అనేక సమస్యలు వస్తున్నాయని.. ఆదాయ మార్గాలు పెరిగి ప్రతి కుటుంబంలో కార్లు పెరిగాయాన్నారు. నగరంలో ట్రాఫిక్ రద్దీ పెరగడం వల్లే మెట్రో, ఎంఎంటీఎస్ విస్తరించుకున్నామని చెప్పారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ రోడ్ల విస్తరణకు ఇబ్బందులు ఉన్నాయని అయినా సరే సిగ్నల్స్ వద్ద ఆగకుండా వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రద్దీ ప్రాంతాల్లో ఫుట్పాత్ ఆక్రమణలు తొలగిస్తున్నామని.. చిరువ్యాపారులకు ఇతరచోట్ల స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. నగరంలోని పలుచోట్ల మల్టీ లెవల్ కారు పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. దూరం తగ్గించేందుకు ఎలివేటెడ్ కారిడార్లు వేస్తున్నామని.. సిటీ మధ్య నుంచి అన్ని ప్రాంతాలకు ఎలివేటెడ్ కారిడార్లు వస్తాయన్నారు.
మూడు ప్రాంతాలుగా స్టేట్
రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విభజించి అభివృద్ధి చేస్తున్నామని సీఎం రేవంత్ వెల్లడించారు. క్యూర్, ప్యూర్, రేర్గా విభజించి ట్రాఫిక్ రద్దీ తగ్గేలా చూస్తున్నామన్నారు. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామని.. ప్యూర్ రీజియన్లో పరిశ్రమలు ఉంటాయన్నారు. క్యూర్లో సర్వీస్ సెక్టార్, ప్యూర్లో ఇండస్ట్రియల్ సెక్టార్, రేర్లో అగ్రికల్చర్ సెక్టార్ ఉండేలా ప్రత్యేక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నామన్నారు. ఆన్లైన్లోనే లెసెన్సులు రెన్యువల్ చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పరిపాలన అంతా ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చామని సీఎం వెల్లడించారు.
అందుకే ఎల్ అండ్ టీ వద్దు
మెట్రో విస్తరణకు ఎల్ అండ్ టీ ముందుకు రాలేదని.. కేంద్రప్రభుత్వ నిబంధన వల్ల మెట్రోను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రూ.15 వేల కోట్లు కేటాయించి మెట్రోను స్వాధీనం చేసుకున్నామన్నారు. మెట్రోను మరో 76 కిలోమీటర్లు విస్తరిస్తామని.. మెట్రో విస్తరణపై కేంద్రం కూడా సానుకూలంగా స్పందించిందని అన్నారు. ఇక డ్రైనేజ్ వ్యవస్థను మారిస్తే మూసీ సుందరీకరణ త్వరగా పూర్తవుతుందన్నారు. సబర్మతి, యమున, గంగాను ప్రక్షాళన చేస్తామని అక్కడి సీఎంలు చెబుతున్నారని.. గుజరాత్ అభివృద్ధిలో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతిచ్చిందని గుర్తు చేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి సైతం అందరూ కలిసి రావాలని సీఎం రేవంత్ కోరారు.