ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నదగడ, అమ్మాయిపల్లి గ్రామాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రజల సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై మంత్రి స్థానిక ప్రజలు, అధికారులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు.

సమావేశంలో గ్రామస్థులు తమ సమస్యలను నేరుగా మంత్రికి వివరించారు. వాటిపై స్పందించిన మంత్రి, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అభివృద్ధి పనుల్లో వేగం పెంచడంతో పాటు నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించిన మంత్రి, ఎట్టి పరిస్థితుల్లోనూ పనుల్లో రాజీ పడవద్దని స్పష్టం చేశారు. అలాగే సంక్షేమ పథకాల అమలు పూర్తిగా పారదర్శకంగా ఉండాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
గ్రామ స్థాయిలో సమస్యలను ముందుగానే గుర్తించి, వెంటనే పరిష్కరించే విధంగా అధికారులు చురుకుగా పనిచేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు.