- 60 ఏళ్ళుగా ఆక్రమణలో ఉన్న పార్కు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్లోని ఎల్లారెడ్డిగూడలో పార్కులో ఉన్న ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. మదురానగర్ మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలో ఎల్లారెడ్డిగూడ పార్కులో 1961 నుంచి పార్కు స్థలాన్ని కొందరు అక్రమణదారులు ఆక్రమించి అక్రమ కట్టాలను నిర్మించారు. దీంతో స్థానికులు, సాయి సారధినగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ ప్రతినిధులు కలిసి హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది ఆదివారం ఉదయం ఆక్రమ నిర్మాణాలను తొలగించింది. ఈ క్రమంలో తమ 60 ఏళ్ళ పోరాటానికి ఫలితం దక్కిందంటూ స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. 1961లో ఐదెకరాల స్థలంలో సాయి సారధినగర్ పేరిట 35 ప్లాట్లతో లేఔట్ ఏర్పాటు చేశారు. దానిలో 1533 గజాల స్థలాన్ని పార్కుగా చూపించారు. అయితే నారాయణ ప్రసాద్ అనే వ్యక్తి వారసులు పార్కు స్థలాన్ని ఆక్రమించి, లేఔట్ ఏర్పాటు చేసి ఇంటి నంబర్ తెచ్చుకున్నట్లుగా హైడ్రాకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వివిధ శాఖలతో కలిసి క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన హైడ్రా అధికారులు పార్కు స్థలం ఆక్రమణకు గురైనట్లుగా గుర్తించారు. పార్కులో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించి, ప్రొటెక్టెడ్ బై హైడ్రా బోర్డును ఏర్పాటు చేశారు.