Take a fresh look at your lifestyle.

జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిలో 20 నుంచి 25 వరకు పర్యాటకుల మృతి?

  • దక్షిణ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రదాడి
  • ప్రభుత్వ వర్గాల ప్రకారం కనీసం 25 మంది మృతి
  • మృతుల సంఖ్యపై అధికారిక ప్రకటన రావాల్సి ఉందన్న సీఎం ఒమర్ అబ్దుల్లా
  • దాడిని ఖండించిన ప్రధాని మోదీ, కఠిన చర్యలకు ఆదేశం
  • పరిస్థితి సమీక్షకు శ్రీనగర్ బయలుదేరిన హోం మంత్రి అమిత్ షా

దక్షిణ కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన పహల్గాంలో తీవ్ర ఉగ్రదాడి జరిగింది. పర్యాటకులే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో కనీసం 20 నుంచి 25 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ వర్గాలు ప్రాథమికంగా వెల్లడించాయని ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ ఘటనతో కశ్మీర్ లోయ మరోసారి ఉలిక్కిపడింది.

మృతుల సంఖ్యను ఇంకా ధృవీకరించాల్సి ఉందని, పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ఇటీవలి సంవత్సరాలలో పౌరులే లక్ష్యంగా జరిగిన దాడుల్లో ఇది అత్యంత తీవ్రమైనదని ఆయన ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.

గాయపడిన వారికి చికిత్స అందిస్తున్న ఒక ఆసుపత్రిలోని వైద్యుడు మాట్లాడుతూ, ఈ ఘటనలో గాయపడిన 12 మంది తమ ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అన్నారు.

పర్యాటకుల వివరాల కోసం అనంత్‌నాగ్ పోలీసులు అత్యవసర సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పర్యాటకులకు సహాయం లేదా పర్యాటకుల సమాచారం కోసం ఈ ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వివరాలు తెలుసుకోవాలనుకునే వారు 9596777669, 01932225870 నెంబర్లకు ఫోన్ చేయవచ్చని లేదా 9419051940 నెంబర్‌కు వాట్సాప్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.