హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్ పాల్ ను రాష్ట్రపతి నియమించారు. అలాగే మరో నలుగురు కొత్త జడ్జీలను నియమిస్తూ బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సుజయపాల్ కు సీజేగా బాధ్యతలు అప్పగిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే బాంబే హైకోర్టు సీజేగా బదిలీ అయ్యారు. 1964 జూన్ 21న జన్మించిన జస్టిస్ సుజయ్ పాల్ బీకాం, ఎంఏ, ఎల్ఎల్బీ పూర్తిచేసి 1990లో మధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకున్నారు. పలు బ్యాంకులు, మానవ హక్కుల కమిషన్, బోర్డులకు సేవలు అందించిన ఆయన 2011 మే 27న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగానూ, 2014 ఏప్రిల్ 14న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుతో 2024 మార్చి 21న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. తాజాగా ఆయన హైకోర్టు సీజేగా నియమితులయ్యారు.
మరో నలుగురు కొత్త జడ్జీలు నియమకం
తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం బుధవారం ప్రకటన విడుదలచేసింది. సీనియర్ న్యాయవాదులైన జస్టిస్ రేణుక యర, జస్టిస్ నర్సింగ్ రావు నందికొండ, జస్టిస్ తిరుమల దేవి, జస్టిస్ మధుసూదన్ రావును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నియమించారు. జస్టిస్ రేణుక యర, జస్టిస్ నర్సింగ్ రావు నందికొండ, జస్టిస్ తిరుమల దేవి, జస్టిస్ మధుసూదన్ రావు పేర్లను ఇటీవల సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు చేయగా రాష్ట్రపతి ఆమోద ముద్రవేశారు. తెలంగాణ హైకోర్టుకు కొత్త జడ్జిల నియమించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం జనవరి 11న సమావేశంలో ఈ నలుగురి పేర్లను ఫైనల్ చేసింది. అనంతరం కొలీజియం రాష్ట్రపతి సిఫార్సు చేసినట్లు ప్రకటనలో తెలిపింది.