- రంగంలోకి కేసీఆర్
- ఇప్పటిదాకా సైలెంట్ గానే కీలక నేతలు
- కేసీఆర్ కామెంట్స్ తో మళ్లీ మొదలైన సంబురం
- ఈ నెలలోనే భారీ సభకు ప్లాన్
- ఇటీవల సర్వేలో కాంగ్రెస్ కు వ్యతిరేక పవనాలు
- అందిపుచ్చుకోవాలని గులాబీ ప్లాన్
ముద్ర, తెలంగాణ బ్యూరో :-నిన్నా, మొన్నటి వరకు ఫాంహౌజ్ కే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్…. ఇక రేవంత్ సర్కార్ పై యుద్ధభేరి మ్రోగించేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ కు చుక్కలు చూపించేందుకు పక్కా వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే భావనలో గులాబీ బాస్ ఉన్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీపై దండ యాత్ర మొదలుపెట్టేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నారు.
ఇందులో భాగంగా ఈ నెలలోనే భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. ఈ సభకు భారీగా జన సమీకరణ చేయాలని తలపెట్టారు. తద్వారా కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పెరుగెత్తించాలన్న కసితో ఉన్నారు. సభకు తరలి వచ్చిన జన సమూహాన్ని చూసి రేవంత్ సర్కార్ ఇక నిద్రపట్టకుండా చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై పూర్తి ఆధిపత్యం చెలాయించాలన్న లక్ష్యంతో ఉన్నారు. ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై నేరుగా ఒక మాట, విమర్శలు చేయని కేసీఆర్….రెండు రోజుల క్రితం మాత్రం రేవంత్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. `కాసుకో…రేవంత్! త్వరలోనే వస్తున్నా…. నేను కొడితే మాములుగా ఉండదు’ అంటూ గట్టిగానే రేవంత్ కు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో కొంత ప్రశాంతంగా ఉన్న రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నిజంగానే కేసీఆర్ ఫాంహౌజ్ ను వీడి…. హైదరాబాద్ కు వచ్చి రేవంత్ సర్కార్ పై యుద్దం మొదలుపెడితే పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న అంశంపై రాజకీయవర్గాల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పక్షాన రేవంత్ సర్కార్ పై మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు నిరాటంకంగా వివిధ అంశాలపై యుద్ధం కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను చాలా బలంగా ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. కాంగ్రెస్ సర్కార్ పై ఏ మాత్రం చిన్న అవకాశం వచ్చినా సరే…గులాబీ పార్టీ తరపున దండ యాత్ర చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియాను కూడా తమవైపుకు తిప్పుకుని…. రేవంత్ సర్కార్ ను అనేక అంశాల్లో ఇరుకున పెడుతూనే ఉన్నారు. వీటికే రేవంత్ సర్కార్ కు ఒక పట్టాన ఊపిరి ఆడడం లేదు. ఈ సమయంలో కేసీఆర్ కూడా ఎంటర్ అయితే… రాజకీయాలు మరింత రంజుగా మారనున్నాయని తెలుస్తోంది.
ఇదెలా ఉండగా వివిధ సంక్షేమ పథకాలు తమకు చేరడం లేదన్న అసంతృప్తి ప్రజల్లో నెలకొంది. ఇదే అంశంపై అక్కడక్కడ మంత్రులను ప్రజలను నిలదీస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ శాసనసభ్యుల్లో సైతం అసంతృప్తి రాగాలు వినిపిస్తున్నారు. మంత్రుల తీరుపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న అధికార పార్టీ శాసనసభ్యులు…. రెండు రోజుల క్రితం రహస్య సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఇది కాంగ్రెస్ కు ఎంతమాత్రం మింగుడుపడడం లేదు. రహస్య సమావేశం ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది…? దీని ప్రధాన ఎజెండా ఏమై ఉంటుంది? దీని వెనుక ఎవరైనా సొంత పార్టీ నేతలే ఉన్నారా? లేక ప్రతిపక్షాల పాత్ర ఏమైనా ఉందా? కేంద్రం పెద్దల హస్తం ఉందా? తదితర అంశాలపై ప్రస్తుతం సీఎం రేవంత్ తో పాటు..పార్టీ హైకమాండ్ సైతం ఆరా తీస్తోంది. ప్రస్తుతం సొంత పార్టీలోనే అసమ్మతి సెగలు రాజుకున్న నేపథ్యంలో అధికార పార్టీపై పోరాటం చేయడానికే ఇదే సరైన సమయమని కేసీఆర్ భావిస్తున్నారు. పైగా ఇటీవల కాంగ్రెస్ నిర్వహించిన సర్వేలోనూ …ఆ పార్టీకి వ్యతిరేక పవనాలు చాలా బలంగా వీస్తున్నాయన్న సంకేతాలు రావడంతో….ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలన్న యోచనలో గులాబీ బాస్ ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులను తిరిగి కార్యోన్ముఖులను చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇలాంటి సంకేతాలు కేసీఆర్ నుంచి వస్తుండడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ మరింతగా పెరుగుతోంది. దీంతో ఇక కాంగ్రెస్ కు ఇబ్బందులు తప్పవన్న ప్రచారం కూడా జోరుగానే వినిపిస్తోంది. మరి పార్టీ శ్రేణులు ఆశించిన విధంగా కేసీఆర్ తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండి రేవంత్ సర్కార్ పై యుద్దం మొదలుపెడతారా? లేక ఎప్పటి మాదిరిగానే ప్రకటనలకే పరిమితం అవుతారా ? అన్నది త్వరలో తేలనుంది.