-
సిబ్బంది ఆరోగ్యమే ప్రధానం: ప్రత్యేకాధికారి పంకజ, కమిషనర్ శైలజ
బోడుప్పల్, ముద్ర విలేకరి: బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి వృత్తి నిర్వహణలో అవసరమైన సామాగ్రిని మంగళవారం కార్పొరేషన్ ప్రత్యేక అధికారి ఎస్.పంకజ అందించారు. ఇందులో పారిశుద్ధ్య పరికరాలు, మాస్కులె, గ్లౌస్ లు, స్నానపు సబ్బులు, దుస్తులు ఉతుక్కునే సబ్బులు, కొబ్బరి నూనె, ఒక్కో కార్మికునికి రెండు జతల వస్త్రాలు, సేఫ్టీ షూస్, చెప్పులు, ఇతర సామాగ్రిని అందించారు.


రాష్ట్ర ప్రభుత్వం పారిశుధ్య కార్మికుల భద్రత, శ్రేయస్సుకు మొదటి ప్రాధాన్యతను ఇస్తుందని ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి పంకజ పేర్కొన్నారు. అందులో భాగంగానే కార్మికులకు అవసరమైన అన్ని సమకూరుస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎ.శైలజ, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ ఇ.శ్యామసుందర్ రావు, శానిటరీ ఇన్ స్పెక్టర్ బి.నారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మట్టి గణపతి విగ్రహాల పంపిణీ
తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో మట్టి గణపతి విగ్రహాలను ప్రత్యేక అధికారి ఎస్.పంకజ అందించారు. అలాగే మణికంఠ కాలనీలో దాతల సహకారముతో ప్రత్యేక అధికారి, కమీషనర్ చేతుల మీదుగా కాలనీ అసోసియేషన్ తో కలసి మట్టి గణపతులు స్థానిక నివాసితులకు అందించారు.ఈ సందర్భముగా కాలనీ వాసులను అధికారులు అభినందించారు.