ముద్ర కూకట్పల్లి:
రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. శనివారం కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని వసంత నగర్లో ‘ఇవానియా’ బ్యూటీ పార్లర్ను టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్తో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మహిళలు సంకల్పం, పట్టుదలతో స్వయం ఉపాధి రంగాల్లో రాణించి ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. టీజీ ఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ, ఎంతటి పెద్ద ప్రయాణమైనా చిన్న అడుగుతోనే మొదలవుతుందని, మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు.
గతంలో కేవలం సంపన్నులకే పరిమితమైన పెట్రోల్ బంకుల నిర్వహణను, నేడు స్వయం సహాయక సంఘాల ద్వారా మధ్యతరగతి మహిళలకు సైతం అందుబాటులోకి తెచ్చినట్లు బండి రమేష్ గుర్తుచేశారు.
ఆర్టీసీ బస్సులను మహిళలే కొనుగోలు చేసి అద్దెకు ఇచ్చేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వివరించారు.
ఈ కార్యక్రమంలో కూన శ్రీశైలం గౌడ్, సత్యం శ్రీరంగం, గాలి బాలాజీ, శేరి సతీష్ రెడ్డి మరియు ఇతర పార్టీ నాయకులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు