కోరుట్ల, ముద్ర విలేకరి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 2 వందల కోట్ల మంది మహిళా ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారని ఈ మేరకు మహాలక్ష్మి పథకం విజయవంతం కావడంపై రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుపుతున్నట్లు ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండి తెలిపారు. ఎం.డి ఆదేశాల మేరకు బుధవారం కోరుట్ల డిపోలో మహాలక్ష్మి సంబరాలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోరుట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి జీవాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉద్యోగాలకు వెళ్లే మహిళలు, విద్యార్థులు, కూరగాయలు అమ్మే మహిళలు ను బస్టాండ్ ఆవరణలో సత్కరించి వారికి బహుమతులు అందజేయడం జరిగిందని డిపో మేనేజర్ అన్నారు. విద్యార్థులతో మహాలక్ష్మి పథకంపై వ్యాసరచన పోటీలను కూడా నిర్వహించి, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం మహిళలు మహాలక్ష్మి పథకంపై సందేశాన్ని చాలా చక్కగా వారి మాటల్లో వివరించడం జరిగిందని కోరుట్ల డిపో మేనేజర్ మనోహర్ ఒక ప్రకటనలో తెలిపినారు. ఈ కార్యక్రమంలో డిపో మహిళా ఉద్యోగులు, ట్రాఫిక్, గ్యారేజ్, సూపర్వైజర్ లు, సెక్యూరిటీ సిబ్బంది, ప్రయాణికులు పాల్గొన్నారు.