సిద్ధగురు ఆధ్వర్యంలో పితృ తర్పణం, పితృ దోష నివారణ హవనం, అన్నదానం
ముద్ర ప్రతినిధి, భువనగిరి
భువనగిరి మండలంలోని రమణేశ్వరంలో ఆదివారం మహాలయ అమావాస్య సందర్భంగా పితృ దేవతలకు సమర్పణలు, తర్పణాలు, దానాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి అనేకమంది భక్తులు హాజరై పితృ శాంతి కోసం ప్రార్థనలు చేశారు.
మహాలయ అమావాస్య పితృపక్షం ముగింపు సందర్భంగా ప్రత్యేకమైనది. పితృ దేవతలు భూమికి వచ్చి తమ వారసులు చేసే తర్పణాలను స్వీకరిస్తారని విశ్వాసం ఉంది. ఈ సందర్భంగా సిద్ధగురు భక్తుల సమక్షంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నడిపించారు.
ప్రభాత వేళ ధ్యానం తో ప్రారంభమైన ఈ వేడుకలో, సిద్ధగురు పితృ దోష నివారణ హవనం నిర్వహించారు. అగ్నిద్వారా పితృదేవతలకు సమర్పించిన హవిస్సులు వంశ శాంతి, వంశాభివృద్ధికి మార్గం చూపుతాయని శాస్త్రవేత్తలు చెబుతారు. అనంతరం భక్తులతో కలిసి సిద్ధగురు పితృ తర్పణం సమర్పించారు.
కార్యక్రమంలో భాగంగా అన్నదానం విశేషంగా జరిగింది. రమణేశ్వరానికి విచ్చేసిన వేలాదిమంది భక్తులు ఈ సేవలో భాగస్వాములయ్యారు. పేదలకు, యాత్రికులకు అన్నదానం చేసి పితృదేవతలను సంతోషపరిచారు. సిద్ధగురు మాట్లాడుతూ “మహాలయ అమావాస్య అనేది పితృదేవతల ఆశీర్వాదం పొందే పవిత్రమైన రోజు. ప్రేమతో చేసిన తర్పణాలు, దానాలు వంశానికి క్షేమం, సమృద్ధి, శాంతిని తీసుకువస్తాయి” అని తెలిపారు. ఈ పవిత్ర సందర్భం రమణేశ్వరంలో భక్తి, సేవ, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా నిలిచి, హాజరైన వారందరికీ పితృ శాంతి, దైవానుగ్రహం ప్రసాదించినది.