- వికారాబాద్ జిల్లా ఎస్పీ కే నారాయణ రెడ్డి వెల్లడి
వికారాబాద్, ముద్ర ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలో వరకట్న వేధింపులకు సంబంధించిన ఒక కీలకమైన కేసులో శుక్రవారం వికారాబాద్ జిల్లా కోర్టు నిందితుడికి కఠిన శిక్ష వేసిందని జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి వెల్లడించారు.ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 2018లో తాండూర్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో నిందితుడు చాకలి అరుణ్కు జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి డాక్టర్ ఎస్. శ్రీనివాస్ రెడ్డి గారు పది (10) సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ. 5,000/- (రూపాయలు ఐదు వేలు మాత్రమే) జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు (6) నెలల పాటు కఠిన కారాగార శిక్ష అనుభవించాలని తీర్పు ఇచ్చారు.కేసు వివరాల్లోకి వెళితే, పాత తాండూర్కు చెందిన ఫిర్యాదుదారురాలు చాకలి చంద్రమ్మ తన రెండవ కుమార్తె అనూషకు దౌల్తాబాద్ మండలం చంద్రకళ గ్రామ నివాసి అయిన చాకలి అరుణ్తో తేది 24.04.2018న వివాహం జరిపారు.పెళ్లి సమయంలో, ఫిర్యాదుదారురాలు తమ కుమార్తెకు వరకట్నంగా 2.5 తులాల బంగారం మరియు రూ .81 వేల నగదును ఇచ్చారు.వివాహం జరిగిన కొద్దికాలానికే, అల్లుడు చాకలి అరుణ్ అదనపు వరకట్నం తీసుకురావాలని తన భార్య అనూషను వేధించడం ప్రారంభించాడు. అంతేకాకుండా, అనుమానం పెంచుకుని మానసికంగా వేధించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ వేధింపులు భరించలేక, అనూష 03.08.2018న ఇంట్లో ఎవరూ లేని సమయంలో దులానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.ఈ ఫిర్యాదు ఆధారంగా, అప్పటి తాండూర్ ఇన్స్పెక్టర్ కె. ప్రతాపలింగం కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత, ఛార్జ్ షీట్ను కోర్టులో సమర్పించారు. వాదోపవాదనలు విన్న జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి డాక్టర్ ఎస్. శ్రీనివాస్ రెడ్డి నిందితుడు చాకలి అరుణ్ను దోషిగా నిర్ధారించి, పైన పేర్కొన్న శిక్షను విధించారు.ఈ కేసు దర్యాప్తు మరియు ప్రాసిక్యూషన్లో అద్భుతంగా పని చేసిన అధికారులను జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. వారిలో:
• పబ్లిక్ ప్రాసిక్యూటర్ : పి. సుధాకర్ రెడ్డి.
• మొదటి దర్యాప్తు అధికారి : కె. ప్రతాపలింగం, సీఐపీ, అప్పటి తాండూర్ సి ఐ
• రెండవ దర్యాప్తు అధికారి రామచంద్రుడు, డీఎస్పీ, డివిజన్. (అప్పటి తాండూర్ డి.ఎస్.పి)
• ప్రస్తుత డీఎస్పీ: కె. బాలకృష్ణ రెడ్డి.
• ప్రస్తుత స్టేషన్ హౌస్ ఆఫీసర్ బ్రీఫింగ్ ఆఫీసర్: జి. సంతోష్ కుమార్, ఇన్స్పెక్టర్, తాండూర్ పోలీస్ స్టేషన్.
: ముహమ్మద్ తౌఫీక్
• లైసన్ ఆఫీసర్: బి. వీరన్న (ఎస్ఐ).
వరకట్న వేధింపులకు పాల్పడే వారికి ఈ తీర్పు ఒక హెచ్చరికగా నిలుస్తుందని, బాధితులకు న్యాయం అందించడంలో పోలీసులు కట్టుబడి ఉన్నారని ఎస్పీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మహిళల భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు.
Prev Post