Take a fresh look at your lifestyle.

18 నెలలు..రూ. 20వేల కోట్లు … హైదరాబాద్ అభివృద్ధికి బాటలు

  • సిద్ధమవుతున్న ప్రణాళికలు
  • నాలుగు నెలల్లో కనీసం రూ.5వేల కోట్లు అవసరం
  • నిధుల సేకరణకు హెచ్​ఎండీఏ కసరత్తు
  • నిధుల లేమీతో పెండింగ్​ లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు

ముద్ర, తెలంగాణ బ్యూ‌‌రో : హైదరాబాద్ మరింత అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. పెట్టుబడులే లక్ష్యగా విదేశీ కంపెనీలను ఆకర్శించే పనిలో నిమగ్నమైన రాష్ట్ర ప్రభుత్వం రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన.. విస్తరణపై దృష్టిపెట్టింది. పలు ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు 18 నెలల వ్యవధిలోనే రూ.20వేల కోట్ల రుణాలను సేకరించడానికి హెచ్‌ఎండీఏ చర్యలు చేపట్టింది.రుణ మార్కెట్‌ ద్వారా నిధులను సేకరించాలని భావిస్తోంది.

ఈ నెలాఖరుకు సలహాదారునుగానీ, బ్యాంకు మర్చెంట్‌నుగానీ నియమించే అవకాశాలున్నాయి. ఎంపికయ్యే సంస్థ కానీ, సలహాదారుకానీ నాలుగు నెలల్లోనే రూ.5వేల కోట్ల రుణాన్ని సేకరించాలని నిబంధన కూడా విధించారు. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినా.. ఇవ్వకపోయినా రుణాలను ఇప్పించాలంటూ షరతు కూడా పెట్టారు. సంబంధిత సంస్థకు సేకరించే రుణంపై కమీషన్‌ చెల్లించే అవకాశం ఉంది. ఇటీవల టెండర్లను ఆహ్వానించడంతో పాటు ఆసక్తి కలిగిన సంస్థలు,వ్యక్తులతో హెచ్‌ఎండీఏలో ఫ్రీబిడ్‌ సమావేశాన్ని నిర్వహించారు.పలువురు తమ సందేహాలను వ్యక్తం చేయగా అధికారులు నివృత్తి చేశారు. బిడ్డర్‌ను క్వాలిటీ అండ్‌ కాస్ట్‌ పద్ధతిలో ఎంపిక చేయడానికి హెచ్‌ఎండీఏ అధికారులు చర్యలు చేపడుతున్నారు.

నగరాభివృద్ధిలో హెచ్​ఎండీఏ

నగరాన్ని సకల సౌకర్యాలతో అందంగా తీర్చిదిద్దే బాధ్యతను హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ)కు అప్పగించింది. హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్రణాళికల రూపకల్పన చేస్తున్న హెచ్ఎండీఏ నగరంలో వివిధ పనుల కోసం రూ.20 వేల కోట్ల రుణాలను సేకరించేందుకు సిద్ధమైంది. ఆ రుణాలతో మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయం తీసుకున్నది. నగరాభివృద్ధికి సంబంధించి మౌలిక సౌకర్యాల కోసం హెచ్‌ఎండీఏ నిధుల సమస్యను ఎదుర్కొంటున్నది. ఈ క్రమంలో అప్పులు చేసి మరీ ఆ ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు కసరత్తు చేస్తున్నది. దాని కోస ఏడాదిన్నరలో రూ.20వేల కోట్ల రుణాలను సేకరించేందుకు చర్యలు చేపట్టింది.

రుణాల ప్రతిపాదనలు సిద్ధం చేసి వాటిని కార్యరూపంలో పెట్టేందుకు అవసరమైన సలహాదారు లేదా బ్యాంకు మర్చెంట్‌ను నియమించేందుకు టెండర్లను ఆహ్వానించింది. ప్రభుత్వం గ్యారెంటీ ఉన్నా.. లేకున్నా రుణాలు ఇప్పించాలంటూ ఈ టెండర్లలో హెచ్‌ఎండీఏ స్పష్టం చేసింది. ఇదీలావుంటే సొంతంగా ఆదాయ వనరులు సమకూర్చుకుంటున్న హెచ్ఎండీఏ… హైదరాబాద్‌ మహానగర విస్తరణలో కీలకంగా వ్యవహరిస్తున్నది. గతంలో హుడాగా, ప్రస్తుతం హెచ్‌ఎండీఏగా నగర విస్తరణలో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నది. దేశంలో ఏ మెట్రోపాలిటన్‌ నగరానికి లేనివిధంగా 15 ఏళ్ల క్రితమే హైదరాబాద్‌కు ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం చేసిన హెచ్‌ఎండీఏ.. ఏటా కనీసం రూ.500 కోట్ల ఆదాయం వచ్చే విధంగా ఓఆర్‌ఆర్‌ను రూపకల్పన చేసింది. అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నిర్మాణంలోనూ కీలకంగా వ్యవహరించి.. పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రె్‌సవేను నిర్మించింది. తెలుగుతల్లి, బషీర్‌బాగ్‌, హైటెక్‌ సిటీ తదితర పదికిపైగా ప్లైఓవర్లను నిర్మించి నగరవాసులకు ట్రాఫిక్‌ చిక్కులు లేకుండా చేసింది.

గత ప్రభుత్వ హయాంలో కోకాపేట, బుద్వేల్‌, మోకిల్లా, బాచుపల్లి, మేడిపల్లి, బహదూర్‌పల్లి, తొర్రుర్‌, కుర్మల్‌గూడ, తుర్కయాంజల్‌.. ఇలా నగరం నలువైపులా రూ.వేల కోట్ల విలువ చేసే స్థలాలను లేఅవుట్లుగా తీర్చిదిద్ది విక్రయించింది. సుమారు రూ.13 వేల కోట్ల ఆదాయాన్ని హెచ్‌ఎండీఏ సమకూర్చగా..నాటి ప్రభుత్వం ఆ నిధులను ఇతర పనులకు మళ్ళించింది. ఓఆర్‌ఆర్‌ను రూ.7,380 కోట్లకు ఓ ప్రైవేటు సంస్థకు విక్రయించింది. ఇలా దాదాపు రూ.20వేల కోట్ల వరకు గత ప్రభుత్వానికి హెచ్‌ఎండీఏ సమకూర్చింది. గత పదేళ్లలో ప్రభుత్వం నుంచి హెచ్‌ఎండీఏకు వచ్చిన నిధుల కంటే హెచ్‌ఎండీఏ నుంచి ప్రభుత్వానికి వచ్చిన రాబడియే అధికంగా ఉండటం విశేషం.

అప్పడలా.. ఇప్పుడు డీలా

గతంలో విలువైన ఆస్తులు కలిగి ఉండి.. నగరంలో అనేక మౌలిక సదుపాయాలు సమకూర్చుకున్న హెచ్ఎండీఏ ఇప్పుడు నిధులు లేక ఢీలా పడింది. దాని ఆధీనంలో ఉన్న భూములు, స్థలాలను గత ప్రభుత్వం ఆన్‌లైన్‌ వేలం వేసి విక్రయించింది. ఇటు ఓఆర్‌ఆర్‌నూ ప్రైవేటు సంస్థకు కట్టబెట్టింది.దీంతో హెచ్‌ఎండీఏకు ఆదాయ మార్గాలు కరవయ్యాయి. దాంతో నగర విస్తరణలో మౌలిక సదుపాయాల కల్పన హెచ్‌ఎండీఏకు పెనుభారంగా మారింది. మీరాలం చెరువుపై కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణానికి సుమారు రూ.3వేల కోట్లు కావాల్సి ఉండగా, సికింద్రాబాద్‌ నుంచి శామీర్‌పేటకు, సికింద్రాబాద్‌ నుంచి డైరీఫామ్‌ రోడ్డు వరకు డబుల్‌ డెక్కర్‌ ప్లైఓవర్లను నిర్మించటానికి మరో రూ.6 వేల కోట్లు, ఓఆర్‌ఆర్‌ నుంచి ఫ్యూచర్‌ సిటీకి నిర్మించతలపెట్టిన ప్రధానమైన గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డుకు రూ.4 వేల కోట్లు అవసరం పడింది. ఇటు శివారు ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ, ప్లైఓవర్ల నిర్మాణం పనుల ప్రతిపాదనలను హెచ్ఎండీఏ సిద్ధం చేసుకున్నది. అందుకోసం అప్పులు సేకరించడానికి సిద్ధమైంది. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ భవన నిర్మాణ, లేఅవుట్‌ అనుమతుల జారీ ద్వారా ఏటా రూ.1500-1800 కోట్ల మేర ఆదాయం వస్తోంది. హెచ్‌ఎండీఏ పరిధిలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధితో మునుముందు ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే తమకు వస్తున్న ఆదాయం, వివిధ ప్రాంతాల్లో గల స్థిరాస్తులను చూపించి రుణాలు సేకరించేందుకు హెచ్‌ఎండీఏ కసరత్తు చేస్తున్నది.

Leave A Reply

Your email address will not be published.