ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
బిజినపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేడు మెగా స్పెషలిస్ట్ వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించబడుతోంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు వైద్యాధికారి డాక్టర్ పి. సృజన తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నిపుణులైన వైద్యులు గ్రామాలకు వచ్చి వైద్య సేవలు అందిస్తున్న ఈ అవకాశాన్ని ప్రజలు తప్పకుండా వినియోగించుకోవాలని సూచించారు. శిబిరంలో స్త్రీరోగ నిపుణులు, పిల్లల వైద్యులు, ఎముకలు మరియు కీళ్ల నిపుణులు, దంత వైద్యులు, కంటి వైద్యులు, జనరల్ ఫిజీషియన్లు పాల్గొని ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సాధారణ ఆస్పత్రి నుండి వచ్చిన నిపుణులైన వైద్య బృందం ద్వారా రోగులకు సమగ్ర పరీక్షలు చేపట్టబడతాయి. ఈ శిబిరంలో మూత్రం, రక్త పరీక్షలు వంటి అన్ని రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహించి, అనంతరం అవసరమైన చికిత్స అందించనున్నట్లు తెలిపారు.
కాబట్టి బిజినపల్లి మండల ప్రజలు ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ పి. సృజన కోరారు.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు: 9490927816, 9441628160.