Take a fresh look at your lifestyle.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఏఐ 

  • లబ్ధిదారుల ఎంపిక నుంచి ఇల్లు పూర్తయ్యే వరకు కృత్తిమ మేధస్సు వినియోగం 
  • రోజువారీగా ఇండ్ల ప్రగతి
  • నిరుపేదలను గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతిక విధానం 
  • మొబైల్​ యాప్​ ద్వారా నిర్వహించిన సర్వే వివరాలు ఏఐతో లింక్
  • రాజకీయాలకు తావు లేకుండా లబ్ధిదారుల ఎంపిక 
  • ఇందిరమ్మ ఇండ్ల సమీక్షలో మంత్రి పొంగులేటీ శ్రీనివాస్​ రెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో :- రాష్ట్ర  ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ఇందిర‌మ్మ ఇండ్ల పథకంలో ఎలాంటి అక్ర‌మాల‌కు, అవినీతికి తావు లేకుండా ల‌బ్దిదారుల‌కు మేలు చేకూరేలా సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని విరివిగా వాడుకోవాల‌ని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార శాఖ మంత్రి  పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. ఇందిర‌మ్మ ఇండ్ల‌పై స‌చివాల‌యంలో  బుధ‌వారం  ఆయన  స‌మీక్ష చేశారు.ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడుతూ , ల‌బ్దిదారుల ఎంపిక నుండి ఇండ్ల నిర్మాణం పూర్త‌య్యేవరకూ కృత్రిమ మేధ‌స్సు ( ఆర్టిఫీషియ‌ల్ ఇంటిలిజెన్స్‌- ఎఐ) వాడుకోవాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు వెల్ల‌డించారు.  పార‌ద‌ర్శ‌కంగా ల‌బ్దిదారుల ఎంపిక చేప‌ట్టేందుకు ఇప్ప‌టికే ప్ర‌త్యేక యాప్‌ను రూపొందించి స‌ర్వే నిర్వ‌హించ‌డం జ‌రిగిందన్నారు. ఇండ్ల నిర్మాణం, చెల్లింపుల‌లో  ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌ల‌కు ఆస్కారం లేకుండా  రాష్ట్రంలో ఎక్క‌డినుంచైనా రోజువారీగా ఇండ్ల నిర్మాణ పురోగ‌తిని పర్యవేక్షించేలా ఏ‌ఐని ఉప‌యోగించుకోవాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు. నిజ‌మైన‌ నిరుపేద‌ల‌ను గుర్తించేందుకు అత్యాధునిక  సాంకేతిక విధానాల‌ను అమలు చేస్తున్నామన్నారు. మొబైల్ యాప్ ద్వారా నిర్వ‌హించిన స‌ర్వే వివ‌రాల‌ను  క్లౌడ్ ఆధారిత కృత్రిమ మేధ‌స్సు టెక్నాల‌జీతో సరిపోలుస్తూ అనర్హులను గుర్తించి అర్హులను ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. ఇండ్ల నిర్మాణానికి సంబంధించి నాలుగు దశల్లో చెల్లింపులు చేస్తామన్నారు. ఈ చెల్లింపుల్లో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా ఎప్పటికప్పుడు చెల్లించేలా ఏ‌ఐ టెక్నాలజి ని వాడుకోవాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.
రాజ‌కీయ ప్రమేయానికి తావు లేకుండా, ఇత‌ర ప్ర‌భావిత విభాగాల జోక్యం లేకుండా ల‌బ్దిదారుల ఎంపిక జ‌రిగేలా ఈ విధానాలు స‌హ‌క‌రిస్తాయన్నారు. అన‌ర్హులు ఎవ‌రైనా ఉంటే పూర్తిగా గుర్తించే అవ‌కాశాలు ఈ నూత‌న సాంకేతిక విధానం వ‌ల‌న సాధ్య‌ప‌డుతుంద‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం గ‌ణ‌తంత్ర దినోత్సవం సంద‌ర్భంగా ప్రారంభించిన 4 ప్ర‌తిష్టాత్మ‌క ప‌ధ‌కాల‌లో ఇందిర‌మ్మ ఇండ్ల ప‌ధ‌కం ఒకటన్నారు. దీనిలో తొలి విడ‌త‌గా నివాస స్ధ‌లం క‌లిగిన  72 వేల మంది ల‌బ్దిదారుల‌కు మంజూరు ప‌త్రాల‌ను అంద‌జేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఈ ఇండ్ల నిర్మాణ‌ ప‌నులను వెంటనే  ప్రారంభించేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని  అధికారుల‌ను ఆదేశించారు. తొలివిడ‌త ఇండ్ల మంజూరులో అత్యంత నిరుపేద‌లు, విక‌లాంగులు, వితంతువులు, ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు ప్రాధాన్యత ఇస్తునట్టు తెలిపారు. ఈ  సమావేశంలో హౌసింగ్ సెక్రెటరీ  జ్యోతి బుద్ధ ప్రకాష్, హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.