ముద్ర ప్రతినిధి,పెద్దపల్లి: ఈ నెల 27న జిల్లాలో నిర్వహించనున్న శాసనమండలి ఎన్నికల పోలింగ్ జిల్లాలో పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. కలెక్టరేట్ లో సోమవారం ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు పోలింగ్ నిర్వహణపై శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ప్రతి ఒక్కరికి అనుభవం ఉందని,ఎక్కడా తేలికగా తీసుకోకుండా ఎన్నికల విధులను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు.జిల్లాలో పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 36 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 14 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, నిబంధనలు పాటిస్తూ పోలింగ్ సజావుగా జరపాలని అన్నారు. పోలింగ్ విధుల పట్ల ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని, శిక్షణ కార్యక్రమాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు.ఈ శిక్షణా కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో అదనపు కలెక్టర్ డి.వేణు,ఏ ఆర్ ఓ లు గంగయ్య, సురేష్,తహసిల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.