ముద్ర ప్రతినిధి మెదక్:
మెదక్ జిల్లా నిజాంపేట మండలం తిప్పన్నగుల్ల గ్రామంలో కాకతీయ శైలిలో ఉన్న పురాతన శివాలయం గుర్తించామని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు బుర్ర సంతోష్ తెలిపారు.

ప్రస్తుతం పూర్తిగా ధ్శిథిలమైన స్థితిలో ఉన్న ఈ శివాలయంలో శివలింగం లేదని, అద్భుతంగా లతలు, సింహాలు, హంసలతో చెక్కిన మూడు గర్భద్వారాలు ఉన్నాయని పేర్కొన్నారు. శైవ ద్వారపాలకుల శిల్పాలు అద్భుతంగా అన్ని వైపులా ఉన్నాయన్నారు. గుడి చిత్రాలను పరిశీలించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్ ఈ శివాలయం ఎర్లీ కాకతీయ శైలిలో ఉందని, ద్వార బంధాలలో లాలట బింబంగా గజలక్ష్మి ఉందని వెల్లడించారు. గుడి బయట నల్ల రాతి మీద చెక్కిన చతుర్భుజుడైన భైరవుడి శిల్పం ఉంది. మెదక్ జిల్లా గొప్ప చరిత్రను చాటేలా నిర్మించిన ఇలాంటి పురాతన వారసత్వ సంపదను కాపాడుకోవాలని బుర్ర సంతోష్ పిలుపునిచ్చారు.
తిప్పన్నగుళ్ల చరిత్ర
తిప్పన్న గుళ్ల గ్రామానికి ఈ పేరు స్థిరపడటానికి తిప్పుడు నిర్మించిన గుడులు కారణం. ఆ గుడి నిర్మాణాలు శిథిలావస్థలో ఉన్నప్పటికీ అద్భుతమైన కళాత్మక శిల్ప సంపద ఉట్టిపడుతున్నది. గుడికీ, గుడి శిథిలమవటానికీ చరిత్ర వుంది. తిప్పడు అనే దళితుడు సైనిక, పాలనాధికారిగా ఉంటూ ఈ దేవాలయ నిర్మాణం చేశాడని, పూర్తయిన తర్వాత గుడి పూజాది కార్యక్రమాల్ని ఇతరులు వెలివేయగా, ఆలయం శిథిలమవుతూ వచ్చిందని అతని పేరు మీద తిప్పనగుల్ల గ్రామనామం ఏర్పడిందని ప్రతీతి.
