ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ పట్టణ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీ దయనీయ పరిస్థితిపై ప్రజలు, విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గత పదేళ్లుగా కాలేజీ అభివృద్ధిని పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి కాలేజీని ప్రత్యక్షంగా సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఈ పర్యటనలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాలేజీ భవనం నిర్మాణానికి రూ.9 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న పాత భవనం స్థానంలో ఆధునిక సదుపాయాలతో నూతన భవనం నిర్మించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఆయన, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కాలేజీ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించి, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
ఈ నిర్ణయంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆశలు నెలకొన్నాయి. కొత్త భవనం నిర్మాణంతో కాలేజీకి మరింత మెరుగైన విద్యా వాతావరణం కలగనుందని స్థానికులు భావిస్తున్నారు .