ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
పాఠశాలలు, స్వయం సహాయక సంఘాల భవన నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. గురువారం వీడియో కాన్ఫరెన్సు హాలు నుండి అన్ని మండలాల ఏంపిడిఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో కంపౌండ్ వాల్ నిర్మాణ పనులు, పాఠశాలల మౌలిక వసతుల అభివృద్ధి మహిళల సాధికారతకు తోడ్పడే స్వయం సహాయక సంఘాల భవన నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగాలని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మన ఊరు–మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో తరగతి గదులు, శౌచాలయాలు, తాగునీటి సదుపాయాలు, కాంపౌండ్ వాల్స్ వంటి మౌలిక వసతుల పనులు త్వరగా పూర్తి చేయాలనీ ఆదేశించారు. పాఠశాల ప్రాంగణాన్ని సురక్షితంగా ఉంచడం, అనధికార ప్రవేశాలను నిరోధించడం, విద్యార్థులకు సురక్షితమైన వాతావరణం కల్పించడం ప్రధాన లక్ష్యంగా ఈ నిర్మాణాలు చేపట్టాలని, అన్ని సౌకర్యాలు కలిపించడం వల్ల పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెరగడంతో పాటు, తల్లిదండ్రుల్లో విశ్వాసం మరింత బలపడుతుందని అన్నారు. అదేవిధంగా మహిళల ఆర్థిక స్వావలంబనను పెంపొందించేందుకు స్వయం సహాయక సంఘాలకు ప్రత్యేక భవనాల నిర్మాణం చేపట్టబడిందని, ఈ భవనాలలో సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, ఆదాయోపాధి కార్యకలాపాలకు ఉపయోగపడనున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో మహిళల భాగస్వామ్యం మరింత బలపడుతుందని, నిధులు మంజూరై మొదలు పెట్టని భవన నిర్మాణ పనులను ప్ర్రారంబించాలని అన్నారు. అధికారుల సమన్వయంతో నిర్మాణ పనులు నిర్దిష్ట గడువులో పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని, పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించి, పారదర్శకతతో అమలు చేయాలని అన్నారు. పనుల పురోగతి పై మండలం వారిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ సుదీర్, జిల్లా పంచాయతి అధికారి జయసుధ, జిల్లా విద్యా శాఖాదికారి రేణుకా దేవి, పంచాయతి రాజ్ ఈఈ ఉమేష్ కుమార్, అన్ని మండలాల ఎంపిడిఓలు, ఎంపిఓలు తదితరులు పాల్గొన్నారు.