ముద్ర కూకట్పల్లి :
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకొని, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు తన కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా కార్యకర్తలకు, నాయకులకు ఉగాది పచ్చడిని అందజేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ.. ఉగాది పండుగ కొత్త ఆశయాలకు, ఆరంభాలకు ప్రతీక అని పేర్కొన్నారు. జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలనే గొప్ప సందేశాన్ని ఉగాది పచ్చడిలోని షడ్రుచులు మనకు అందిస్తాయని చెప్పారు.
కార్యకర్తలందరూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటూ, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలని కోరారు. ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు నిండాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు.
ఈ వేడుకల్లో స్థానిక బిజెపి నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.