ముద్ర మల్కాజిగిరి:
ట్రాఫిక్ రద్దీతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు రైల్వే అధికారులు వెంటనే ఆర్ యు బి నిర్మాణం చేపట్టాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశించారు.మచ్చ బొల్లారం ఆర్యుబి నిర్మాణంపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి అధ్యక్షతన అధికారుల తో సమీక్ష సమావేశం నిర్వహించారు.
మచ్చ బొల్లారం రైల్వే గేటు వద్ద తరచుగా ఏర్పడుతున్న ట్రాఫిక్ రద్దీ, ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆర్యుబి నిర్మాణం అత్యవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆర్యుబి నిర్మాణం పూర్తయితే సమయభావం తగ్గి, ట్రాఫిక్ సమస్యలు తగ్గుముఖం పట్టి, స్థానిక ప్రజలకు ప్రయాణికులకు పెద్దఎత్తున ఉపశమనం కలుగుతుందని తెలిపారు. భూసేకరణ, సర్వే, సాంకేతిక అంశాలు, శాఖల సమన్వయం విషయాలపై సంబంధిత అధికారులతో సవివరంగా చర్చించారు. పనులు వేగవంతంగా ప్రారంభమయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో రైల్వే ల్యాండ్ ఆక్విజిషన్ అధికారి శేషాచారి, రైల్వే సెక్షన్ ఇంజనీర్ సామ్రాట్ రాయ్, అల్వాల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ బోగేశ్వర్లు, అల్వాల్ డిప్యూటీ తహసీల్దార్ పృథ్వి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీనివాస్ రెడ్డి, ట్రాఫిక్ ఏసిపి శంకర్ రాజు పాల్గొన్నారు.