Take a fresh look at your lifestyle.

విద్యార్థులే బ్రాండ్ అంబాసిడర్లు

  • కలెక్టర్ అభిలాష అభినవ్.

ముద్ర ప్రతినిధి, నిర్మల్: విద్యాసంస్థల ఔన్నత్యాన్ని తెలపడం లో విద్యార్థులే బ్రాండ్ అంబాసిడర్లని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయుకేటి (రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జీ టెక్నాలజీస్)ని ఆమె గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఛాంబర్‌లో అధికారులు, బోధన సిబ్బందితో సమావేశమై, విద్యార్థులకు అందిస్తున్న బోధన, వసతులపై సమీక్ష నిర్వహించారు. ప్రవేశాల ప్రక్రియ, అభివృద్ధి పనుల పురోగతిపై అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రవేశాల ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.బోధనేతర సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలన్నారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడిన కలెక్టర్, బాసర ఐఐఐటి దేశానికే గర్వకారమని, విద్యార్థులే యూనివర్సిటీకి బ్రాండ్ అంబాసిడర్లని పేర్కొన్నారు.విద్యార్థులకు ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బోధన, బోధనేతర అంశాల్లో సమీక్షలు నిర్వహిస్తూ, సమస్యలు తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వర్క్‌షాపుల స్థితి, అకడమిక్ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్, నైపుణ్యాభివృద్ధి ప్రధానంగా ఉండేలా విద్యా బోధన సాగాలన్నారు. గేట్, సివిల్స్‌ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు డిజిటల్ లైబ్రరీ సహాయంతో కోచింగ్ అందిస్తున్నట్టు చెప్పారు. ఆగస్టు లో భోజనశాలకు కొత్త గుత్తేదారు నియమిస్తామని, భోజనశాల విస్తరణతో పాటు పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. వసతి గృహాలు, తరగతి గదులు, మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచాలని సూచించారు.యూనివర్సిటీ ప్రాంగణాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, విద్యార్థులకు అందిస్తున్న వసతులను పరిశీలించారు.మహిళా సంఘాల ఆధ్వర్యంలో రూ. 3.20 లక్షల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ‘ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్’ పనులను పరిశీలించి, విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా మంచి తినుబండారాలు అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపకులపతి గోవర్ధన్, ఓ ఎస్ డి మురళి దర్శన్, ఇన్‌చార్జి డీఆర్‌డీఓ శ్రీనివాస్, ఆర్డీఓ కోమల్ రెడ్డి, తహసిల్దార్ పవన్ చంద్ర, ఎంపిడిఓ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.