- సంక్షేమ పథకాల అర్హతలపై అధికార పార్టీ నేతల వివాదస్పద వ్యాఖ్యలు
- కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పిన వాళ్లకే ప్రభుత్వ పథకాలిస్తామన్న నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే
- ఇందిరమ్మ కమిటీలో ఐదుగురు సభ్యులు చెబితే సీఎం చెప్పినట్లేనన్న సంపత్ కుమార్
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలకు అర్హతలపై అధికార పార్టీల వ్యాఖ్యలు వివాదస్పదమవుతున్నాయి. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లు,రేషన్ కార్డులపై పలువురు నేతలు చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపుతున్నాయి. మంగళవారం నాగర్ కర్నూల్ లో పార్టీ ముఖ్యకార్తల సమావేశంలో పాల్గొన్న నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దలు,కార్యకర్తలు చెప్పిన వారికే ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జాబితా సిద్ధం చేసి స్థానిక ఎమ్మెల్యేకి ఇస్తే ఎమ్మెల్యే ఎంపిక చేసిన లిస్ట్ మాత్రమే ఫైనల్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.
గ్రామ సభ లిస్ట్ కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇచ్చిన జాబితా మాత్రమే బయటపెట్టాలని జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్,డీపీవోకి ఆదేశాలు జారీ చేసినట్టు రాజేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏదైనా గ్రామంలో తమ కార్యకర్తలు చెప్పినట్టు వినకుండా అధికారులు లబ్ధిదారుల జాబితా బయట పెడితే అ గ్రామంలో ఎవ్వరికీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు రాకుండా చేస్తా బహిరంగంగా హెచ్చరించారు. మరోవైపు.. ఆలంపూర్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఏఐసీసీ నాయకులు సంపత్ కుమార్ ఏ ప్రభుత్వ పథకం అయినా కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పిన వారికే ఇస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ కమిటీలో ఉన్న ఐదుగురు సభ్యులు చెప్తే రేవంత్ రెడ్డి చెప్పినట్లేనని చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారాన్ని లేపాయి.