దేశ ప్రజలకు ఊరటనిచ్చేలా పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు. ఈ నిర్ణయం కష్టకాలంలో ప్రజలపై పడుతున్న ఇంధన భారం తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.
దేశం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమయోచిత నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు అండగా నిలుస్తున్నారని పవన్ కళ్యాణ్ కొనియాడారు. పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం దేశంపై పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం ఆయన దౌత్య నైపుణ్యానికి నిదర్శనమని అన్నారు.
పెట్రోల్పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.10 వరకు తగ్గించడం, డీజిల్పై ఉన్న సుంకాన్ని పూర్తిగా రద్దు చేయడం ద్వారా ప్రజలకు గణనీయమైన ఊరట లభించిందని తెలిపారు. ఈ చర్య వల్ల సామాన్య ప్రజలతో పాటు చమురు సంస్థలకు కూడా లాభం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇంధన కొరత సమస్య రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ, దేశ అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.