కూకట్పల్లిలో కనులపండువగా శ్రీ సీతారామచంద్ర స్వామివారి కల్యాణం ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ ఉపాధ్యక్షులు బండి రమేష్
ముద్ర కూకట్పల్లి :
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని కూకట్పల్లి నియోజకవర్గవ్యాప్తంగా శ్రీ సీతారామచంద్ర స్వామివారి కల్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా, కనులపండువగా జరిగాయి. ఆలయాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ వేడుకల్లో టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ స్థానిక నాయకులతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన కల్యాణ వేడుకల్లో పాల్గొన్న ఆయనకు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ.. శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఎన్నో లక్షల సంవత్సరాల తర్వాత కూడా ఉత్తమ పాలనకు ‘రామరాజ్యం’ ఒక కొలమానంగా నిలిచిందంటే, అది శ్రీరాముని పరిపాలనా దక్షతకు నిదర్శనమని కొనియాడారు. నేటికీ ఆయన పాలన ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, బ్లాక్ అధ్యక్షులు, మార్కెటింగ్ కమిటీ సభ్యులు, టెంపుల్ కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్, మైనారిటీ, SC, BC సెల్ నాయకులు, సేవాదళ్ కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు