- జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ను ఆదేశించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
- రంగారెడ్డి జిల్లాలో 57 శాతం సన్న బియ్యం రేషన్ షాపులకు చేరిందన్న మంత్రి.
- లోటుపాట్లు లేకుండా పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామని అదనపు కలెక్టర్ వెల్లడి.
ఉమ్మడి రంగారెడ్డి, ముద్ర ప్రతినిధి: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ను ఆదేశించారు. శుక్రవారం పౌరసరఫరాల, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో సన్న బియ్యం పంపిణీ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఇప్పటికే అన్ని మండల, గ్రామ కేంద్రాల్లో నిర్వహించడం జరిగిందన్నారు. స్థానిక మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలతో చర్చించి కార్యాచరణ ప్రణాళిక మరింత ముందుకు తీసుకుపోవడానికి ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్లను ఆదేశించారు. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని, అందుకు తగిన విధంగా స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొని విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. బియ్యం నాణ్యత, పరిమాణానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలని, బియ్యం పంపిణీలో ఎలాంటి అవకతవకలు, పొరపాట్లు జరగకుండా చూడాలని కలెక్టర్లకు సూచించారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో 57 శాతానికి పైగా సన్నబియ్యం చౌక ధరల (రేషన్ షాప్) దుకాణాలకు వచ్చాయని, మిగిలిన స్టాక్ను రాబోయే రెండు రోజుల్లో పంపిణీ చేయాలని మంత్రి అన్నారు.వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ సన్న బియ్యం పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరుగకుండా ప్రత్యేకంగా శ్రద్ద వహించి పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా పౌర సరఫరాల అధికారులు శ్రీనివాస్, గోపీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
