Take a fresh look at your lifestyle.

మా సర్వేలో 56.33శాతం బీసీ రిజర్వేషన్లు

  • కులగణనలో జనాభా లెక్కల ఆధారంగా తేల్చాం
  • రాజకీయ ప్రయోజనాల కోసం సర్వే చేయలేదు
  • విపక్షాలవి అవగాహనరాహిత్య ఆరోపణలు
  • సర్వేలో పాల్గొనని వారికి మాట్లాడే అర్హత లేదు
  • సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్​యలు
  • కులగణనలో వివరాలిచ్చిన  వారికే మైకు ఇవ్వాలి
  • వివరాలు బయటపెట్టాల్సి వస్తుందనే వారు పాల్గొనలేదు
  • వ్యక్తిగత వివరాలు బయటపెట్టలేం
  • అసెంబ్లీలో కులగణన సర్వే నివేదిక చర్చలో సీఎం రేవంత్ రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్​ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే లో తేలిన జనాభా లెక్కల ప్రకారం బీసీ రిజర్వేషన్లు 56.33శాతం తేల్చామని సీఎం రేవంత్​ రెడ్డి సీఎం చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం, అవగాహన రాహిత్యంతో సభలో మాట్లాడం సరికాదని కేటీఆర్ పై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తప్పుల తడక బీఆర్ఎస్ సమగ్ర కుటుంబ సర్వే నివేదికను ప్రజల ముందు, సభముందు పెట్టకుండా లిమ్కా బుక్ రికార్డుకు అందించిన ఘనులని విమర్శించారు. ఎంతకాలం ప్రజలను బీఆర్ఎస్ మోసం చేస్తుందని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు రిజర్వేషన్లపై చిత్తశుద్ధితో కులగణన ప్రక్రియను నిర్వహించామని స్పష్టం చేశారు. మంగళవారం అసెంబ్లీలో జరిగిన కులగణన సర్వే నివేదిక చర్చలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.

కులగణన సర్వేలో పాల్గొనని శాసన సభ్యులకు దీనిపై చర్చలో మాట్లాడే అర్హత లేదని వ్యాఖ్యానించారు. సర్వేలో పాల్గొన్న వారికే మైక్ ఇవ్వాలని, సర్వేలో పాల్గొనని సభ్యులకు ఇవ్వవద్ధని స్పీకర్ గడ్డం ప్రసాద్ ను విజ్ఞప్తి చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, పద్మారావు, డీకే.అరుణ వంటి వారు సర్వేలో పాల్గొనలేదన్నారు. సర్వే ప్రశ్నపత్రంలో 5వ పేజీలో భూముల వివరాలు చెప్పాల్సి వస్తుందని భయపడి సర్వేకు కేసీఆర్ కుటుంబం దూరంగా ఉందని సీఎం ఆరోపించారు. ఇప్పటికైన వారంతా సర్వేలో వివరాలు అందించాలని కోరారు. సర్వేలో అడిగిన ప్రశ్నలతోనే కొంత మంది సర్వేకు దూరంగా ఉన్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా చెప్పారని చురకలేశారు. ఆయన అడిగినట్లుగా 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ జరగాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లకు చిత్తశుద్ధి ఉంటే పార్టీ పరంగా 42శాతం టికెట్లు ఇచ్చేందుకు ముందుకు రావాలని సవాల్ చేస్తున్నానన్నారు.

2014లో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు బీసీలు 61శాతం(హిందూ బీసీ 51%+ముస్లిం బీసీ 10%)అని..ఇప్పుడు బీసీల సంఖ్య కులగణన సర్వేలో 46% ఎలా తగ్గిందన్న కేటీఆర్ వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు. 1.12శాతం మాత్రమే జనాభా వృద్ధి రేటు ఉందని అందుకే జనాభా పెరుగుదల తక్కువగా కనిపిస్తుందని చెప్పారు. సర్వేలో పాల్గొనని వారి లెక్కలు కూడా రాలేదని గుర్తు చేశారు. కులగణన సర్వేలో బీసీలు, మైనార్టీల జనాభా శాతం పెరిగిందని స్పష్టం చేశారు. దీనిపై సభ్యులకు వివరాలు అందిస్తామన్నారు. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక ఎందుకు జనాభా గణన చేపట్టలేదని..బీజేపీ సభ్యులు జనాభా లెక్కించమని మోడీని ఎందుకు అడగడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

కేబినెట్​ లో చర్చ.. అసెంబ్లీలో ఆమోదం..!

తెలంగాణ రాష్ట్రంలో సర్వీస్ కమిషన్ చేపట్టిన కులగణన సర్వే ను ఈ రోజు కేబినెట్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. ఈ సందర్భంగా కులగణన నివేదికను ప్రవేశ పెట్టేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం కేబినెట్ ఆమోదం తెలిసిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ నివేదికపై సభ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేయగా మంత్రులు సహా, సీఎం వారి అనుమానాలకు క్లారిటీ ఇచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన ఈ సమావేశంలో చివర్లో సీఎం రేవంత్ రెడ్డి సామాజిక, ఆర్థిక, కులగణన సర్వే తీర్మానానికి ఆమోదం  తెలపాలని పిలుపునిచ్చారు.దీంతో సామాజిక, ఆర్థిక, కుల గణన సర్వే తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో అసెంబ్లీ ఆమోదం తెలిపిన కులగణన వివరాలు ఇకపై అధికారిక లెక్కలుగా రూపొందనున్నాయి.

వెనకబడిన వర్గాల అభ్యున్నతి కోసమే కులగణన

వెనకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కులగణన సర్వే చేపట్టామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో 66 లక్షల 99 వేల 602 కుటుంబాల సమాచారం సేకరించామని చెప్పారు. రాష్ట్రంలో 96.9 శాతం సర్వే నిర్వహించామన్నారు. రాష్ట్రంలో ఎస్సీలు-17.43 శాతం, ఎస్టీలు- 10.45 శాతం, బీసీలు- 46.25శాతం, ముస్లీం మైనార్టీల్లో బీసీలు- 10.08 శాతం, ముస్లీం మైనార్టీలు కలుపుకుని బీసీలు- 56 శాతం, రాష్ట్రంలో ముస్లింలతో సహా మొత్తం ఓసీలు- 15.79 శాతం ఉన్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో బలహీనవర్గాలకు సంబంధించి ఇప్పటి వరకు సహేతుకమైన సమాచారం లేదని చెప్పారు. దీంతో రిజర్వేషన్లు అమలు చేసే క్రమంలో ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి నెలకొందన్నారు. 1931 తరువాత భారతదేశంలో ఇప్పటి వరకు బలహీన వర్గాల సంఖ్య ఎంతో తేల్చలేదనీ జనాభా లెక్కల్లోనూ బలహీన వర్గాల లెక్కలు పొందుపరచలేదని సీఎం పేర్కొన్నారు. అందుకే భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ రాష్ట్రంలో కులగణన చేస్తామని మాట ఇచ్చారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేశామని వెల్లడించారు.

కులగణన ప్రక్రియను పూర్తి చేసి ఇవాళ నివేదికను సభలో ప్రవేశపెట్టామని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతీ గ్రామంలో, తండాల్లో ఎన్యూమరేటర్లు పకడ్బందీగా వివరాలు సేకరించారని అన్నారు. ప్రతీ 150 ఇండ్లను ఒక యూనిట్ గా గుర్తించి ఎన్యూమరేటర్లను కేటాయించి వివరాలు సేకరించామని చెప్పారు. 76 వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు 36 రోజులు కష్టపడి ఈ నివేదికను రూపొందించారు.. రూ.160 కోట్లు ఖర్చుచేసి ఒక నిర్దిష్టమైన పకడ్బందీ నివేదిక రూపొందించామని చెప్పారు. పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తరువాత సభలో ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. 56 శాతం ఉన్న బీసీలకు సముచిత గౌరవం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. దేశానికి ఆదర్శంగా నిలిచేలా నివేదికను రూపొందించడానికి కృషి చేసిన అందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

ఆ వివరాలు బయటపెట్టలేం..!

తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల గణన -2024 నివేదికకు సంబంధించి సర్వేలో పాల్గొన్న పౌరులు ఇచ్చిన వ్యక్తిగత వివరాలను బయటికి వెల్లడించలేమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కులగణన నివేదికలో నాల్గవ విభాగంలో ప్రైవసీ వివరాలు ఉన్నందునా తాము ఆ నివేదిక బయట పెట్టలేమన్నారు. ఆ వివరాలు కాకుండా ఏ వివరాలు అడిగినా సభ్యులకు అందిస్తామన్నారు.ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలు వివరాలు ఇచ్చారన్నారు. గోప్యత చట్టాలను అనుసరించి వ్యక్తిగత వివరాలను బయటపెట్టమని చెప్పారు. సర్వేలో సామాజిక అంశాలకు సంబంధించిన వివరాలను మాత్రం శాసనసభ ముందు ఉంచామని తెలిపారు. సమగ్ర కుల సర్వే-2024పై శాసనసభలో చర్చలో భాగంగా ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ లేవనెత్తిన అంశాలపై సీఎం వివరణలు ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.