పేద వర్గాల వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం
కేంద్ర బడ్జెట్ ను సవరించాల్సిందే
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్
బడ్జెట్ కు వ్యతిరేకంగా 10వ తేదీన ఇందిరా పార్కులో మహాధర్నా : రంగారెడ్డి జిల్లా సిపిఎం కార్యదర్శి యాదయ్య
(ముద్ర ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా కార్పోరేట్ వర్గాలకు అనుకూలంగా ఉందని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ విమర్శించారు. అన్నివర్గాలకు మేలు జరిగేలా బడ్జెట్ ను వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. సీపీఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం హస్తినాపురంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాన్ వెస్లీ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్లకు కొమ్ముకాస్తోందన్నారు. శ్రామిక బడుగు, బలహీన వర్గాలకు తాజా బడ్జెట్ పూర్తిగా వ్యతిరేకంగా ఉండటమే ఇందుకు పరాకాష్ట విమర్శించారు. రూ. 55.60 లక్షల కోట్లకు పైగా రూపొందించిన బడ్జెట్ లో రూ.12 లక్షల కోట్ల కేవలం వడ్డీ చెల్లించడానికి పోతుందని తెలిపారు. కోట్లాదిమంది ఉపాధి కూలీలకు ఉపాధి కల్పించడానికి రూ. 2 లక్షల కోట్లు అడిగితే కేవలం రూ. 85 వేల కోట్లకు పరిమితం చేశారని ఆగ్రహం చేశారు. కార్మిక అసంఘటిత రంగాలకు నిధులు కేటాయించలేదన్నారు. కార్మికులు, పేదలను ఆదుకోవడానికి ఎలాంటి ప్రతిపాదనలు బడ్జెట్ లో లేవన్నారు. గిరిజనులు, దళితుల విద్యా వైద్యానికి బడ్జెట్ లో నిధులు కేటాయించలేదని.. కేంద్ర బడ్జెట్ పూర్తిగా ప్రజా వ్యతిరేకంగా కేంద్ర బడ్జెట్ ఉందని… దీన్ని సవరిస్తూ అన్నివర్గాలకు, ప్రధానంగా నిరుపేద వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేసేవరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని జాన్ వెస్లీ హెచ్చరించారు.
సబ్సిడీల కోత బడ్జెట్ : సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య
సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య మాట్లాడుతూ.. వ్యవసాయ సబ్సిడీలకు కోత పెట్టారని, ఎరువులు రాయితీల్లో రూ.11 వేల కోట్లు తగ్గించారని విమర్శించారు. 16 శాతం ఉన్న దళిత జనాభాకు ఐదు శాతం, 7 శాతం ఉన్న గిరిజనులకు రెండు శాతం నిధులు కూడా బడ్జెట్లో కేటాయించకపోవడం అన్యాయమన్నారు. మైనారిటీల సంక్షేమానికి కేవలం రూ. 3 వేల కోట్లు నిధులను పరిమితం చేశారని మండిపడ్డారు. విద్య, వైద్యానికి కలిపి 25 శాతం నిధులు కావాలని కోరుతుంటే.. నాలుగు శాతానికే పరిమితం చేసిందన్నారు. సంక్షేమ పథకాల అన్నిటిని కుదించిందని, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించడం లేదని విమర్శించారు. తెలంగాణపై కేంద్ర బడ్జెట్లో వివక్ష చూపించిందన్నారు. ఈ నెల 10న ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను సవరించాలని చలో ఇందిరా పార్క్ మహాధర్న నిర్వహిస్తున్నట్లు యాదయ్య తెలిపారు. ధర్నాకు కార్మికులు, వ్యవసాయ కూలీలు, రైతులు, మహిళలు, యువకులు, విద్యార్థులు, వృత్తిదారులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు రామచందర్, భాస్కర్, సామ్యూల్, నర్సింహ, జగదీశ్, చంద్రమోహన్, జగన్, జిల్లా కమిటీ సభ్యులు, ఎల్బీనగర్ సర్కిల్ కార్యదర్శి ఆలేటి ఎల్లయ్య, మండల కార్యదర్శులు, ప్రజాసంఘాల కార్యదర్శులు పాల్గొన్నారు.