Take a fresh look at your lifestyle.

జిల్లా మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్ ను ప్రారంభించిన రేవంత్

ముద్ర ప్రతినిధి, నారాయణపేట: మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా మహిళా సంఘాల సభ్యులకు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసి ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. నారాయణపేట జిల్లాలోని సింగారం క్రాస్ రోడ్డు వద్ద రూ. 1.30 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే లక్ష్యంతో పెట్రోల్ బంకును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి జిల్లాకు ఒక పెట్రోలు బంకు ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రభుత్వ స్థలాలను కేటాయిస్తామన్నారు. మహిళలు తమ కాళ్ళపై నిలబడితే వారి కుటుంబంలోని పదిమందికి సహకరించే విధంగా ఉంటారని, వచ్చిన ఆదాయాన్ని దుర్వినియోగం చేయకుండా తమ పిల్లల భవిష్యత్తుకు ఖర్చు చేస్తారని తెలిపారు.

మహిళల అభివృద్ధి ద్వారా వారి కుటుంబం గౌరవంగా బతకడానికి ఉపయోగపడుతుందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పట్టణ గ్రామీణ ప్రాంతాలు తేడా లేకుండా తెలంగాణ మహిళల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో సహకారం అందిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీలతో వ్యాపారాలు నిర్వహించుకునేందుకు బ్యాంకు రుణాలను విరివిగా అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 60 లక్షల మంది మహిళలు చేరినారని, రాబోవు రోజులలో కోటి మంది మహిళలను సంఘాలలో చేర్చే విధంగా మహిళా సంఘం అధ్యక్షులు కృషి చేయాలని కోరారు.

ఐకెపి ద్వారా మహిళలకు పెట్రోల్ బంకులు, 600 ఆర్టీసీ బస్సుల యజమానులుగా తయారు చేయడం జరిగిందన్నారు. దేశంలో మొదటిసారిగా సోలార్ పార్కుల ద్వారా 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసి మహిళలు వ్యాపారం చేసుకుని అభివృద్ధి చెందే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. మహిళా సంఘాల సభ్యులకు ఒకే డ్రెస్ కోడ్ అమలు చేసే విధంగా వెయ్యి కోట్ల రూపాయలతో నాణ్యమైన రెండు జతల చీరలు అందించనున్నట్లు ముఖ్యమంత్రి తెలియజేశారు. హైదరాబాదులోని శిల్పారామం లో మహిళా సంఘాల సభ్యులు రూపొందించిన ఉత్పత్తులను కార్పొరేట్ స్థాయిలో మార్కెటింగ్ చేసుకునే విధంగా మూడు ఎకరాల స్థలంలో వెయ్యి కోట్ల రూపాయలతో ఆకర్షణీయమైన మార్కెట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు.

కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ న గర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ, స్థానిక శాసనసభ్యులు పర్ణిక రెడ్డి, అచ్చంపేట శాసనసభ్యులు వంశీకృష్ణ, శాసనసభ్యులు వాకిటి శ్రీహరి, వీర్లపల్లి శంకర్, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, సర్ఫ్ సీఈఓ దివ్య దేవరాజన్, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.