Take a fresh look at your lifestyle.

మూసీ పునరుజ్జీవ పనుల్లో స్పీడ్​ పెంచండి

  • ఈ ఏడాది జూన్​ లో మీర్ అలం ట్యాంక్ పై బ్రిడ్జి నిర్మాణ పనులకు టెండర్లు.
  • ట్యాంక్​ లో ఐలాండ్లను పోలిన మూడు ప్రాంతాల అభివృద్ధి.
  • పీపీపీ మోడల్లో ఐలాండ్ జోన్ ను అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలు.
  • జూ పార్కుకు ఐలాండ్ జోన్ అనుసంధానం.
  • భవిష్యత్తు అభివృద్ధి దృశ్యా జూ పార్కు అప్ గ్రేడేషన్​.
  • సందర్శకులు, ప్రయాణికుల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి.
  • టెండర్లకు ముందే డీపీఆర్ ను సిద్ధం చేసుకోవాలి.
  • సర్వేలు, నివేదికలు, ప్రతిపాదనలు, డిజైన్ల విషయంలో తప్పులు దొర్లొద్దు.
  • సింగపూర్ లోని గార్డెన్స్ బై ది బే ను తలపించేలా బర్డ్స్ పారడైజ్, వాటర్ ఫాల్స్ ఉండాలి.
  • వెడ్డింగ్ డెస్టినేషన్ కు వీలుగా ఉండేలా నిర్మాణాలు.
  • కన్వెన్షన్ సెంటర్లు, అడ్వంచర్ పార్క్, ధీమ్ పార్క్, అంఫీ థియేటర్ ఏర్పాటు.
  • మూసీ పునరుజ్జీవనంపై సమీక్షలో సీఎం రేవంత్​ రెడ్డి.

ముద్ర, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.హైదరాబాద్​ లోని లంగర్​ హౌజ్​ వద్ద ఉన్న బాపూఘాట్లో నిర్మించ తలపెట్టిన గాంధీ సరోవర్తో పాటు మీర్ అలం ట్యాంక్ పై నిర్మించనున్న బ్రిడ్జి నమూనాలను సీఎం పరిశీలించారు.మూసీ పునరుజ్జీవనంపై శుక్రవారం హైదరాబాద్​ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.మీర్ అలం ట్యాంక్ పై బ్రిడ్జి నిర్మాణ పనులకు ఈ ఏడాది జూన్​ లో టెండర్లు పిలవాలని సూచించారు.ఈలోగా అందుకు అవసరమైన సర్వేలు, నివేదికలు, ప్రతిపాదనలు, డిజైన్లతో డీపీఆర్ ను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.మీర్ అలం ట్యాంక్ పై నిర్మించే బ్రిడ్జికి సంబంధించి కన్సెల్టెన్సీలు తయారు చేసిన నమూనా డిజైన్లను అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రదర్శించారు. రెండున్నర కిలోమీటర్ల పొడవైన ఈ బ్రిడ్జిని అద్భుతంగా నిర్మించాలని, అదే సమయంలో సందర్శకులు, ప్రయాణికుల రక్షణకు అత్యంత ప్రాధాన్యముండే డిజైన్లను ఎంచుకోవాలని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. ఈ బ్రిడ్జితో పాటు మీర్ ఆలం ట్యాంక్ లో వివిధ చోట్ల ఐలాండ్లా ఉన్న మూడు ప్రాంతాలను పర్యాటకులను ఆకట్టుకునేలా అందంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు.సింగపూర్ లోని గార్డెన్స్ బై ది బే ను తలపించేలా బర్డ్స్ పారడైజ్, వాటర్ ఫాల్స్ లాంటివి ఉండేలా ఈ మూడు ఐలాండ్లను అత్యంత సుందరంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.వెడ్డింగ్ డెస్టినేషన్ కు వీలుగా ఉండే కన్వెన్షన్ సెంటర్లతో పాటు అడ్వంచర్ పార్క్, ధీమ్ పార్క్, అంఫీ థియేటర్ను ఏర్పాటు చేసేందుకు వీలుగా డిజైన్లు ఉండాలన్నారు.బోటింగ్ తో పాటు పర్యాటకులు విడిది చేసేలా రిసార్ట్స్, హోటల్స్ అందుబాటులో ఉండాలని సూచించారు. ట్యాంక్‌ లో నీటిని శుద్ధి చేయటంతో పాటు ఐలాండ్ ను అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని ప్రతిపాదనలతో డీపీఆర్ సిద్ధం చేయాలని చెప్పారు.పీపీపీ మోడల్లో ఈ ఐలాండ్ జోన్ను అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.మీర్ అలం ట్యాంక్లో నీటి లభ్యతను, వరద వచ్చినప్పుడు ఉండే నీటి ప్రవాహ తీవ్రతను ముందుగానే అంచనా వేసుకొని, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందు చూపుతో డిజైన్లు చేసుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన హైడ్రాలజీ తో పాటు పర్యావరణానికి సంబంధించి నిపుణులు, లేదా ఆ రంగంలో పేరొందిన సంస్థలతో సర్వే చేయించాలని, ఆ నివేదికల ఆధారంగా అవసరమైన అన్ని అనుమతులు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. మీర్ అలం బ్రిడ్జితో పాటు ఈ ఐలాండ్ జోన్ను పక్కనే ఉన్న జూ పార్కుకు అనుసంధానం చేయాలని సూచించారు.ఇక్కడి డెవెలప్మెంట్ ప్లాన్ను దృష్టిలో పెట్టుకొని జూ పార్కును అప్ గ్రేడ్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.జూ అధికారులతో సంప్రదింపులు జరిపి, నిబంధనల ప్రకారం అప్ గ్రేడ్ చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని సూచించారు.పర్యాటకులను మరింత ఆకట్టుకునేలా అభివృద్ధి ప్రతిపాదనలు తయారు చేయాలని చెప్పారు.ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, మూసీ రివర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.