Take a fresh look at your lifestyle.

సూత్రదారి సీఎం

  • పాత్రధారి ఒక బీజేపీ ఎంపీ.
  • కంచ గచ్చిబౌలిలో అతిపెద్ద భూ కుంభకోణం.
  • డిసెప్షన్, డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్ అనే 3డీ మంత్రతో రాష్ట్ర ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారు.
  • హెచ్ సియూ భూముల కోసం రూ. 10 వేల కోట్ల కుంభకోణానికి ప్లాన్​.
  • రేవంత్, ఆ ఎపీ కలిసి బ్రోకరేజ్​ సంస్థకే రూ. 17‌‌0 కోట్లు ఇచ్చారు.
  • అమృత్​ స్కాంలో బామ్మర్ధి కోసం రూ. 1137 కోట్లు దారి మళ్లించారు.
  • కాంగ్రెస్​, బీజేపీ ఒకరికొక్కు కాపాడుకుంటున్నారు. 
  • త్వరలోనే కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు.
  • ప్రభుత్వం అమ్మాలనుకున్న భూమి మొత్తం అటవీ భూమే.
  • హెచ్ సీయూలో  జరిగింది పర్యావరణ విధ్వంసం.
  • బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​.
ముద్ర, తెలంగాణ బ్యూరో : కంచ గ‌చ్చిబౌలి భూముల కుంభకోణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే అంతా జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.దీనికి ప్రధాన సూత్రధారి సీఎం అయితే..పాత్రధారి ఒక బీజేపీ ఎంపీ ఉన్నారని ఆరోపించారు.వీరిద్దరి కలయికలోనే  భారీ  అవినీతికి ప్రణాళిక రూపొందిందని ధ్వజమెత్తారు.హెచ్‌ సీ యూ భూముల్లో  పర్యావరణ విధ్వంసమే కాదు..రూ.10 వేల కోట్ల బడా ఆర్థిక మోసం జరిగిందన్నారు .భూయాజమాన్య హక్కు ఎవరిదో తెలుసుకోకుండానే  పది వేల కోట్ల లోన్ ఇచ్చిన ఐసిఐసిఐ బ్యాంకు తన క్రెడిబులిటీని కోల్పోయిందన్నారు. త్వరలోనే ఆ బ్యాంకు కుప్పకూలడం ఖాయమన్నారు.ఈ స్కాం పై సమగ్ర విచారణ జరపాలని కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఆధారాలతో సహా తాను స్వయంగా లేఖలు రాయనున్నట్లు పేర్కొన్నారు.ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే స్పందించి విచారణకు ఆదేశించి తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలన్నారు.మోడీ స్పందించకపోయినా  తాను మాత్రం వదిలిపెట్టనని అన్నారు.అవసరమైతే సుప్రీంకోర్టు తలుపులు తట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని ఇప్పుడు అడ్డుకోకపోతే మరో అరవై వేల కోట్ల రూపాయల భూ దోపిడీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్కెచ్ చేసిందన్నారు. త్వరలోనే  సదరు బీజెపి ఎంపీ పేరును బయట పెట్టనున్నట్లు హెచ్చరించారు.శుక్రవారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  కేటీఆర్ మాట్లాడుతూ,కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత  కేవలం 15, 16 నెలల్లోనే డిసెప్షన్, డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్ అనే 3డీ మంత్రంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి బతుకుల్ని నాశనం చేస్తోందని ర్ ధ్వ‌జ‌మెత్తారు.దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరుకున్న తెలంగాణ రైతన్న కడుపు మీద కొట్టారన్నారు. ప్రజల దృష్టి మరల్చి, భయంకరమైన ఆర్థిక దోపిడీకి రేవంత్ ప్రభుత్వం పాల్పడిందని ఆరోపించారు. హెచ్‌సీయూలో జరిగిన పర్యావరణ విధ్వంసంపై దేశం మొత్తం నివ్వెర పోయి చూసిందన్నారు.అక్కడ పర్యావరణ విధ్వంసం, మూగజీవుల ప్రాణాలు మాత్రమే తీయలేదన్నారు.హెచ్‌సీయూ పక్కన ఉన్న అటవీ భూములను అడ్డం పెట్టుకుని ఒక అతిపెద్ద ఆర్థిక మోసానికి రేవంత్ ప్రభుత్వం పాల్పడిందన్నారు. ఇదొక నేరపూరిత కుట్ర..తెలంగాణ ప్రజల పట్ల విశ్వాసఘాతుకమన్నారు. రాత్రికి రాత్రి బుల్డోజర్లను పెట్టి వందల ఎకరాల్లో చెట్లను కూల్చివేసి మూగ జీవాలకు నిలువ నీడ లేకుండా చేసిన రేవంత్ ప్రభుత్వ ఆరాటం వెనుక  కోట్ల రూపాయల స్కాం ఉందన్నారు. సుప్రీం కోర్టు తీర్పుల ప్రకారం ఆ 400 ఎకరాలు ముమ్మాటికి అటవీ భూమే అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.
  • బీజేపీ ఎంపీ సహకారంతోనే..
రేవంత్ అవినీతికి ఒక బిజెపి ఎంపీ పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని కేటీఆర్ అన్నారు. ట్రస్ట్ ఇన్వెస్ట్ మెంట్ అడ్వైజర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్రోకర్ కంపెనీని తీసుకొచ్చి ఈ కాన్సెప్ట్ ను చెప్పారని అన్నారు.ఎఫ్ ఆర్ బి ఎం ను బైపాస్ చేసి డబ్బులు తీసుకొస్తామని చెప్పి..అందుకు కమిషన్ ఇవ్వాలని ఆ కంపెనీ కోరిందన్నారు.ఇందుకుగానూ  రాష్ట్ర ప్రభుత్వం సదరు కంపెనీకి రూ.169 కోట్లు లంచం చెల్లించిందన్నారు.ఆ తరువాత బీకన్ ట్రస్టీషిప్ అనే కంపెనీని ముందట పెట్టి మోసానికి పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపించారు.సుప్రీంకోర్టు తీర్పు రాగానే రూ. 75 కోట్లకు ఒక ఎకరం చొప్పున ఆ 400 ఎకరాల భూమిని టీజీఐఐసీకి బదిలాయిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ఇచ్చిందన్నారు.అయితే  జీవో ఇచ్చారు కానీ..ఆ భూమిని ఏలియనైజేషన్ చేయలేదన్నారు.సేల్ డీడ్ చేయలేదు..మ్యూటేషన్ కూడా చేయలేదన్నారు. అంటే ప్రభుత్వానికి ఆ భూమిపై ఓనర్ షిప్ రాలేదన్నట్టేనని కేటీఆర్ అన్నారు.టిజిఐఐసికి ఆ భూములపై ఓనర్షిప్ లేదని అటువంటప్పుడు తనది కాని భూమిని బ్రోకర్ కంపెనీ మాట విని టీజీఐఐసి ఎలా తాకట్టు పెట్టిందని ప్రశ్నించారు. ఈ మోసానికి టీజీఐఐసీ తో పాటు పరిశ్రమల శాఖ సెక్రెటరీని జైల్లో వేయొచ్చునని అన్నారు.ఎలాంటి వెరిఫికేషన్ చేయకుండా, భూ యాజమాన్య హక్కులు ఎవరి దగ్గర ఉన్నాయో తెలుసుకోకుండానే ఐసిఐసిఐ బ్యాంకు పదివేల కోట్ల డబ్బులు చెల్లించడంలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రకారం కంచె గచ్చిబౌలి ఏరియాలో గజం విలువ రూ. 26,900 అంటే 400 ఎకరాలకు 5,239. 84 లక్షలు మాత్రమేనన అన్నారు. కానీ రెవిన్యూ శాఖ మాత్రం ఆ భూమి విలువ రూ. 30 వేల కోట్లు అని చెప్పుకుందన్నారు.ప్రభుత్వము, బ్రోకర్ సంస్థ ,ఐసిఐసిఐ బ్యాంకు కుమ్మక్కై ఆ భూమికి లేని విలువను ఉన్నట్టుగా చూపించి పదివేల కోట్ల లోన్ తీసుకున్నారని కేటీఆర్ ధ్వజమెకత్తారు. రిజర్వ్ బ్యాంకును, బ్యాంకులను, దేశాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. పైగా  రూ. 75 కోట్లు ఎకరమని   జీవో ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఐదు నెలల తర్వాత మళ్లీ ఇంకో సంస్థ తో  ఒక ఎకరా కేవలం రూ.52 కోట్లు మాత్రమే అని రిపోర్ట్ తయారు చేయించిందన్నారు. ఇదంతా కేవలం ఐదు నెలల్లోనే రూ. 25 కోట్ల విలువ ఎందుకు తగ్గింది ? అని ప్రశ్నించారు.ఆ తర్వాత బహిరంగ మార్కెట్లో రిలయబుల్ వ్యాల్యూ అసెస్ మెంట్  అని ఎకరాకు రూ. 41.6 కోట్లు మాత్రమే అని ప్రభుత్వం ప్రకటించిందన్నారు.ఇలా  400 ఎకరాల భూమి విలువను 30 వేల కోట్ల నుంచి రూ. 16,640 కోట్ల కు ప్రభుత్వం కుదించిందన్నారు.అసలు భూమిపై ఎలాంటి యాజమాన్య హక్కులు లేకుండానే టీజేఐఐసీ ఆ భూమిని ఐసిఐసిఐ బ్యాంకుకు ఎలా తనఖా పెట్టింది? అని నిలదీశారు. సెల్ డిడ్ కూడా లేని భూమికి ఐసిఐసిఐ బ్యాంకు ఎలా రుణం ఇచ్చింది? అని అడిగారు.ఇది ఫ్రాడ్ కాదా? అని మండిపడ్డారు.బికన్ ట్రస్టీషిప్ అనే కంపెనీ, ట్రస్ట్ అడ్వైజర్స్ అనే బ్రోకర్ని ప్రభుత్వం ఎలా ఎంపిక చేసింది ? ఏ రూల్స్ ని ఫాలో అయ్యారు? అని ప్రశ్నించారు. కేవలం బీజేపీ ఎంపీ చెప్పాడని వాళ్లకు ఇచ్చారా? ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరముందన్నారు.
  • కేంద్రం ఎందుకు మౌనం వహిస్తోంది.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో ఆర్ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధాని మోడీ ఆరోపించారన్నారు,కానీ ఇప్పటిదాకా దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అమృత్ స్కాంలో రేవంత్ రెడ్డి బావమరిదికి రూ.1137 కోట్లు దారి మళ్లించాడని ఆధారాలతో సహా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే ఇప్పటిదాకా ఎలాంటి చర్య తీసుకోలేదన్నారు. రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద ఈడీ దాడులు జరిగితే ఇప్పటిదాకా అధికార ప్రకటన రాలేదన్నారు. ఈ వ్యవహారాన్ని ఈ ఆర్థిక మోసాన్ని కూడా అదే కోవలో కలిపేసి కాంగ్రెస్ బీజేపీ ఒకరినొకరు కాపాడుకుంటారో..లేదంటే నిజంగానే సమగ్ర విచారణకు ఆదేశించి మేము నిజాయితీగా ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఈ దోపిడీని ఉపేక్షించమని చెప్పి కేంద్రం తన చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. దొంగ చేతికి నేను ఇప్పుడే తాళాలు ఎందుకని ఆ బీజేపీ ఎంపీ పేరు చెప్పడం లేదు అని కేటీఆర్ తెలిపారు.ఈ దేశంలో సామాన్యుడు బ్యాంకు లోన్ తీసుకోవాలంటే 100 డాక్యుమెంట్స్‌ని వెరిఫై చేసి 100 కొర్రీలు పెట్టి లోన్ ఇస్తారన్నారు.అదే ఒక సంపన్నుడు అధికారపక్షంతో అనుబంధం ఉన్నవాడు లోన్ అడిగితే నిమిషాల్లోనే మంజూరు చేస్తారన్నారు. కనీసం భూమి ఉందో లేదో కూడా చెక్ చేయరు..ఇక్కడ అదే జరిగిందన్నారు. ఐసిఐసిఐ లాంటి దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు, భూ యాజమాన్య హక్కును పరిశీలించకుండానే ఆ భూమి ఎవరిదో తెలుసుకోకుండానే పదివేల కోట్లు లోన్ ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
  • ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టడం.
హెచ్ సియూ భూముల అవినీతి భాగోతాన్ని బీఆర్ ఎస్ పార్టీ వదిలిపెట్టదని కేటీఆర్ హెచ్చరించారు.దీనిపై ఆర్ బి ఐ గవర్నర్ కు, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, సెబి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థలకు  పార్టీ తరపున ఆధారాలతో సహా ఫిర్యాదు చేయబోతున్నామన్నారు. సమగ్ర దర్యాప్తు చేయాలని కోరుతున్నామన్నారు.ఈ మొత్తం వ్యవహారంలో రేవంత్ రెడ్డి కి అండగా నిలబడ్డ బిజెపి ఎంపీ కి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా త్వరలోనే ఆయాచిత లబ్ధి జరుగుతోందన్నారు.ఈ మొత్తం వ్యవహారంలో బిజెపి ఎంపీ ఉన్నాడనే ఒకే ఒక్క కారణంతో ఐసిఐసిఐ బ్యాంకు లోన్ మంజూరు చేసిందన్నారు..ల్యాండ్ లిటిగేషన్లో ఉందని తెలిసికూడా  ఐసిఐసిఐ బ్యాంకు లోన్ ఇచ్చిందన్నారు.బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు.కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంతో, బిజెపి కుమ్మక్క అయిందని భావించాల్సి వస్తుందన్నారు.  కేంద్ర ప్రభుత్వం సరిగా స్పందించకపోతే కోర్టుకు పోతామన్నారు.

Leave A Reply

Your email address will not be published.