ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఎంపీ ఈటల రాజేందర్
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఘొండా అసెంబ్లీ నియోజకవర్గంలో అనురాగ్ సింగ్ టాగోర్ తో కలిసి బీజేపీ అభ్యర్థి అజయ్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ .. బీజేపీ అభ్యర్థి అజయ్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. తాను 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, తాను తెలంగాణ రాష్ట్ర మొదటి ఆర్థిక మంత్రిని చెప్పుకున్నారు. కరోనా సమయంలో ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేసినట్లు చెప్పారు.
నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక ఏం మార్పులు వచ్చాయో, వాటి గురించిన ఎంత చెప్పినా తక్కువేనని చెప్పారు. కానీ తాను చదువుకునే రోజుల్లో భారత్ ఒక పేద దేశం, నేడు ప్రపంచ దేశాలతో పోటీపడుతున్నదని చెప్పారు. ఇప్పుడు మనవారు ఏ దేశంలో ఉన్నా.. తాను భారతీయున్ని అని గర్వంగా చెప్పుకుంటున్నారని అన్నారు.
2014 కంటే ముందు మన భారత దేశం ఆర్థిక పరిస్థితేంటి, ఇప్పుడేంటి? అని ఒక్కసారి బేరీజు వేసుకుంటే తెలుస్తుందన్నారు. కరోనా సమయంలో ప్రపంచ ఆర్థిక స్థితి తిరోగమనంలో ఉంటే.. భారత ఆర్థిక వికాసం మాత్రం చెక్కుచెదరలేదన్నారు. 11 వ స్థానం నుండి 5 స్థానానికి ఎదిగిందని చెప్పారు. మూడో స్థానానికి చేరుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.