- గత రెండు పర్యాయాలు తనకు రైతు బరోసా రాలేదు అంటున్న వెంకన్న.
- అధికారులు మా మొర ఆలకించండి.
తుంగతుర్తి ముద్ర: ఒకపక్క రైతు భరోసా సహాయం రైతులకు అందిందని అధికారులు చెబుతుండగా మరోపక్క తమకు రైతు భరోసా నిధులు రావడంలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన బయ్య వెంకన్న అనే రైతు తనకు గత రెండు పర్యాయాలుగా రైతు భరోసా రావడం లేదని అంటున్నారు. తాము ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని వ్యవసాయ శాఖ అధికారుల వద్దకు వెళితే తమకేమీ తెలియదని అంటున్నారని వెంకన్న తెలిపారు. తనకున్న రెండున్నర ఎకరాల భూమికి గతంలో రైతు భరోసా వచ్చిందని గత రెండు పర్యాయాలుగా మాత్రం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా రాకపోవడంపై తాము ఎవరికి చెప్పుకోవాలో తెలియక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని అయినా ఫలితం లేకుండా పోతుందని అన్నారు. ఇకనైనా అధికారులు కడుపేద రైతులమైన తమ గోడు పట్టించుకుని తమకు రైతు భరోసా వచ్చేలా చూడాలని కోరుతున్నారు. ఇలాగే తుంగతుర్తి మండలంలో మరికొంతమంది కూడా రైతు భరోసా రాక ఇబ్బందులు పడుతున్న తీరుపై అధికారులకు దరఖాస్తులు చేసుకున్న విషయం తెలిసిందే. అయినా అధికారులు రైతులకు రావలసిన రైతు భరోసా విషయంలో సరియైన చర్యలు తీసుకోవడం లేదనే మాట వినవస్తుంది. ఇకనైనా అధికారులు పట్టించుకుని రైతు భరోసా రాని రైతులకు న్యాయం చేయాలని రైతాంగం కోరుతుంది.
