Take a fresh look at your lifestyle.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్

  • కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీరని అన్యాయం
  • బడ్జెట్ కేటాయింపులన్నీ ఎన్డీఏ భాగస్వామ్య రాష్ట్రాలకేనా…?
  • తెలంగాణ ప్రజలు భాజపాకు 8 మంది ఎంపీలను ఇస్తే మోసం చేస్తారా
  • షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ముద్ర, షాద్ నగర్ : కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని బడ్జెట్ కేటాయింపులన్నీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు, ఎన్డీఏ భాగస్వామ్య పాలిత రాష్ట్రాలకే దక్కాయని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర జిడీపీలో తెలంగాణ వాటా 5 శాతం ఉన్నప్పటికీ ఆమేరకు నిధులు కేటాయించలేదని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో వేల కోట్ల రూపాయలు కేంద్రానికి వెళ్లాయని గతంలో కంటే 12శాతం మేర పెరిగినా రాజకీయ కారణాలతో బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ రాష్ట్రం పై చిన్న చూపు చూశారని మండి పడ్డారు. తెలంగాణ ప్రజలు భాజపాకు 8 మంది ఎంపీలు ఇచ్చినా బిజెపి ప్రభుత్వం వారికి తీరని ద్రోహం చేసి చెవుల్లో పువ్వులు పెట్టిందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో బిజెపి పార్టీకి తెలంగాణ ప్రజలు తగిన గుణం పాఠం చెబుతారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమం లాగా మళ్ళీ కేద్ర ప్రభుత్వం, బిజెపి పార్టీ పై పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. గొప్ప గొప్ప మాటలు చెప్పే బండి సంజయ్, కిషన్ రెడ్డి, డీకే అరుణ లాంటి నాయకులు ఇప్పుడు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి పలుమార్లు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తులు చేసినప్పటికీ వాటికి తుంగలో తొక్కి బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ విడిపోయిన సమయంలో చేసుకున్న ఒప్పందాలను సైతం విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి ఉపాధి హామీ కూలీలు ఎంతో కాలంగా తమ శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలని ఎదురుచూస్తుండగా వారికి బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించాల్సింది పోయి గతంలో కంటే తక్కువ నిధులను కేటాయించి నిరుపేదలపై తమకున్న అక్కసును వెళ్లగక్కారని ధ్వజమెత్తారు. వారి ఆశలను పూర్తిగా అడియాస చేశారని, బడుగు బలహీన వర్గాలకు పూర్తిగా అన్యాయం చేశారని ఆరోపించారు. ఇది కేవలం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్న బడ్జెట్ గా కనిపించిందని పేర్కొన్నారు.బిజెపి తన వైఖరి మార్చుకోకపోతే ప్రజలు తరిమికొట్టడం ఖాయమని ఎమ్మెల్యే అన్నారు. నిరుపేదలకు పక్కా ఇళ్లకు ఒక్క రూపాయి కూడా చెల్లించని కేంద్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పేరును తొలగించాలని పేర్కొనడం హాస్యాస్పదమని ఎమ్మెల్యే శంకర్ అన్నారు.ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పారిశ్రామికవేత్త జీవన్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, వెంకటరామిరెడ్డి, చల్లా శ్రీకాంత్ రెడ్డి, రఘు, బాలరాజ్ గౌడ్, చెంది తిరుపతిరెడ్డి, గడ్డం శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.