ముద్ర, నారాయణపేట:
ప్రతి ఒక్క వాహన చోదకులు వేగ పరిమితులను అతిక్రమించరాదని అలాగే మైనర్లు వాహనాలు నడపవద్దని ఎస్పీ డాక్టర్ వినీత్ కుమార్ సూచించారు.రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా నారాయణపేట జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ మెడికల్ కళాశాలలో విద్యార్థులకు డిఫెన్స్ డ్రైవింగ్ మరియు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించి ఎస్పీ మాట్లాడారు. సురక్షితమైన డ్రైవింగ్ అలవాట్లు అలవరుచుకోవడం ద్వారా అనేక ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. మెడికల్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, మీరు భవిష్యత్త వైద్యులు కాబట్టి సమాజానికి మార్గదర్శకులుగా ఉండాలని, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన పెంచడంలో ముందుండాలని పిలుపునిచ్చారు. ప్రమాదాల్లో గాయపడిన వారి ప్రాణాలను కాపాడే బాధ్యత మీపై ఉంటుందని, అందుకే ముందుగా మీరు సురక్షితంగా ఉండటం అత్యవసరమని తెలిపారు. కుటుంబంలో ఒక వ్యక్తి లేదా కుటుంబ పెద్ద రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబం మొత్తం కుటుంబం మొత్తం రోడ్డున పడే పరిస్థితి ఉంటుందన్నారు. సీఐ శివశంకర్, కళాశాల ప్రిన్సిపల్ కే.సంపత్ కుమార్ సింగ్, ఎస్ ఐ లు రాముడు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.