ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
రబీ సీజన్ సంబంధించి వరి ధాన్య సేకరణకు ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వరి అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేటులోని అదనపు కలెక్టర్ ఛాంబర్ లో రబీ సీజన్ కు సంబంధించి వరి ధాన్యం సేకరణకై సంబంధిత అధికారులతో కార్యాచరణ ప్రణాళిక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రబీ 2025-26 వరి ధాన్య సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు. జిల్లాలోని 129 వరి ధాన్యం సేకరణ కేంద్రాలను సంబంధిత అధికారులు సందర్శించి మౌలిక సదుపాయాల కల్పనకై చర్యలు చేపట్టాలని అధికారులకు తెలిపారు. ప్రతి వరి ధాన్యం సేకరణ కేంద్రాల్లో తూనికల సామాగ్రి, టార్పాలిన్లు, సంచులతో పాటుగా తేమ యంత్రాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె తెలిపారు. సేకరించిన వరి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించే విధంగా ఏర్పాటు చేసుకోవాలని ఆమె అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి సుదర్శన్, జిల్లా మేనేజర్ మోహన్ కృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి రాజరత్నం, జిల్లా సహకార అధికారి నాగార్జున, జిల్లా మార్కెటింగ్ అధికారి సారంగపాణి, లీడ్ బ్యాంక్ మేనేజర్ యాదగిరి, జిల్లా తూనికలు కొలతల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.