- ప్రభుత్వ పాఠశాల, హాస్టళ్ల విద్యార్థుల ఉత్తీర్ణతపై ప్రత్యేక దృష్టి
- హాస్టల్లో నిద్ర కార్యక్రమానికి మంచి స్పందన
- విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తున్న వైనం
- ఆకస్మిక తనిఖీలతో అధికారులు, ఉద్యోగులకు సూచనలు
- ప్రభుత్వ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలగాలి
- కలెక్టర్ హనుమంతరావు
ముద్ర ప్రతినిధి, భువనగిరి: జిల్లాలో ప్రభుత్వ వ్యవస్థ మెరుగుకై, పదవ తరగతి విద్యార్థుల 100 శాతం ఉత్తీర్ణతకై యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు చేస్తున్న కృషితో ఆయన విద్యార్థుల, జిల్లా ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. జిల్లాకు వచ్చిన మొదటినుంచే తనదైన శైలిలో ప్రభుత్వ హాస్టళ్లు, ఆసుపత్రులు, తాసిల్దార్ కార్యాలయాలు, అంగన్వాడి సెంటర్ల పై ఆకస్మిక తనిఖీలు చేస్తూ పాలనను గాడిలో పెడుతున్నారు. అక్కడక్కడ క్రమశిక్షణ తప్పిన ఉద్యోగులపై కఠినంగా వ్యవహరిస్తూ షాకాజ్ నోటీసులు ఇస్తూ ప్రభుత్వ వ్యవస్థ పై ప్రజలకు నమ్మకం కలిగేలా చేస్తున్నారు.
హాస్టల్ లో నిద్ర చేసిన కలెక్టర్
హాస్టల్ లో నిద్ర కార్యక్రమంలో ఈ నెల 5న బుధవారం రాత్రి జిల్లాలోని నారాయణపుర్ లో గల ఎస్సీ హాస్టల్లో రాత్రి నిద్ర చేశారు. ఈ సందర్బంగా విద్యార్థులు ఎలా చదువుతున్నారని వారి క్షేమ సమాచారం తెలుసుకున్నారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం, రోజువారి దినచర్య గురించి కలెక్టర్ ఆరా తీశారు. హాస్టల్ పరిసరాలను, వంటశాలను, మరుగుదొడ్లను పరిశీలించారు
. మంచిగా చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని, ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చని విద్యార్థులకు కలెక్టర్ హిత బోధ చేశారు. విద్యార్థులకు చదువు అందించడంతోపాటు వారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధగాఉండాలన్నారు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చదువుతున్న నిరుపేద విద్యార్థులను మన బిడ్డలుగా భావించి వారిని మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తించాలన్నారు.
విద్యార్థికి అండగా నిలిచి నిత్యావసర సరుకులు అందజేత
ఈ నెల 6న గురువారం ఉదయం నారాయణపురం మండలంలోని కంకణలగూడెం గ్రామంలో పదో తరగతి విద్యార్థుల కోసం ఉదయం 5 గంటల సమయంలో తలుపు తట్టే కార్యక్రమంలో వేకప్ కాల్ చేసి విద్యార్థి ఇంటి డోర్ కొట్టి విద్యార్థిని నిద్రలేపి భరత్ చంద్రచారి అంటూ విద్యార్థిని పిలుచుకుంటూ విద్యార్థి ఇంటికి వెళ్లి అతని పరిస్థితి తెలుసుకున్నారు. విద్యార్థికి తన సొంత ఖర్చులతో పదవ తరగతి ఎగ్జామ్స్ వరకు ప్రతి నెల 5000/- రూపాయలు చొప్పున ఇస్తా అని హామీ ఇచ్చి ఫిబ్రవరి నెలకు 5000 వేల రూపాయలు, విద్యార్థికి చదవడానికి ఒక చైర్, రైటింగ్ పాడ్ అందజేశారు. భరత్ తనకి పోలీస్ ఆఫీసర్ కావాలని ఉందని కష్టపడి సాధిస్తానని కలెక్టర్ స్వయంగా ఇంటికి రావటం నమ్మలేక పోతున్నానని కలెక్టర్ సర్ రావటంతో తనలో ఆత్మ విశ్వాసం పెరిగిందని బాగా చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తానని తెలిపాడు.
ఆకస్మిక తనిఖీలతో
జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేస్తూ అధికారులు, ఉద్యోగుల బాధ్యతలను గుర్తు చేస్తూ కొంతమందికి నోటీసులు జారీ చేసి సక్రమ దారిలోకి తీసుకొస్తున్నారు. జనవరి 9న బొమ్మల రామారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం, ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రైమరీ సెంటర్ డాక్టర్ శ్రీ హర్ష, ల్యాబ్ టెక్నీషియన్ మమత, సుమతి విధులకు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాస్ నోటీస్ జారీ చేశారు. జనవరి 15న ఆలేరు, రాజాపేట, యాదగిరిగుట్ట, మోటకొండూర్ మండల తాసిల్దార్ కార్యాలయాలు తనిఖీ చేసి రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల రికార్డులను తప్పులు దొర్లకుండా చూడాలన్నారు. 16న ఆత్మకూరు మండలంలోని రాయిపల్లి గ్రామంలో, మోత్కూర్ మండలంలోని ముసిపట్ల గ్రామంలో రైతు భరోసా, నూతన రేషన్ కార్డుల లబ్ధిదారులు ఎంపిక సర్వే పరిశీలించారు. 21న రాజాపేట మండలంలోని నెమిల గ్రామంలో ని అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి పిల్లలతో ఏబీసీడీలు చదివించారు.
విద్యార్థులకు మ్యాథ్స్ చెప్పిన జిల్లా కలెక్టర్
రాజపేట మండలంలోని నమిల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జనవరి 21న ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులకు మ్యాథ్స్ క్లాస్ చెప్పారు. పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని పాఠశాల ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీచేశారు. భువనగిరి పట్టణంలోని సింగన్నగూడెంలోని ప్రభుత్వ గిరిజన బాలికల హాస్టల్ ని ఆకస్మికంగా తనిఖీ చేసి మెనూ ప్రకారం భోజనం పెట్టటం లేదని ఆగ్రహం వ్యక్తం చేసి వార్డెన్ విజయలక్ష్మి కి షోకాస్ నోటీస్ జారీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
శుక్రవారం భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి హాజరు రిజిస్టర్ ను పరిశీలించి టి ఎస్ విలియమ్స్ ల్యాబ్ టెక్నీషియన్స్ (గ్రేడ్-2) విధులకు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ల్యాబ్ టెక్నిషియన్స్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎంతమంది సిబ్బంది ఉన్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్య అధికారులు సమయపాలన పాటించాలని, లేనిచో చర్యలు తప్పవని హెచ్చరించారు. మందుల కొరత లేకుండా చూడాలన్నారు. అత్యవసర విభాగం సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు.