- సొంత రాష్ట్రంలో పెట్టుబడుకు ముందుకు రావాలి
- ఆస్ట్రేలియాలో సంక్రాంతి వేడుకల్లో టీపీసీసీ చీఫ్
ముద్ర, తెలంగాణ బ్యూరో : వ్యాపార, ఉద్యోగ రిత్యా విదేశాల్లో స్థిరపడిన తెలంగాణ ఎన్ఆర్ఐలు తమ సొంత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీపీసీసీ చీఫ్ నేతృత్వంలోని రాష్ట్ర బృందం ఆదివారం మెల్బోర్న్ తెలుగు అసోసియేషన్ సంబరాల్లో పాల్గొంది.
ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..తెలంగాణలో మన ప్రభుత్వం ఉందనీ ఇక్కడ ఉన్న తెలుగు పారిశ్రామిక వేత్తలు మీ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టి అక్కడ అభివృద్ధికి సహకారాన్ని అందించాలని ఎన్ఆర్ఐలకు పిలుపునిచ్చారు.ఎల్లలు దాటిన తెలుగు సంస్కృతి ప్రపంచ దేశాల్లో విస్తరిస్తుందన్న ఆయన ఆస్ట్రేలియాకు వచ్చినా కూడా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ అందరూ కలిసి సంబరాలు నిర్వహించుకోవడం చాలా అభినందనీయమన్నారు. తెలుగు ప్రజలు ఇక్కడ లక్ష మంది ఉండి ఎంతో కష్టపడి అభివృద్ధికి సహకారాన్ని అందిస్తూ సంప్రదాయాలను కాపాడుతూ సంబరాలు చేసుకోవడం గొప్ప విషయమన్నారు. సంస్కృతి సంప్రదాయాలు పరిమళించే అతి పెద్ద పండుగ సంక్రాంతి అని,సంక్రాంతి ప్రకృతితో అనుసంధామైన రైతుల పండుగ అని తెలిపారు.ఆరుగాలం శ్రమించి చేతికొచ్చిన పంటను చూసి రైతు మురిసిపోయే పండుగన్నారు. ఈ వేడుకల్లో సాట్ చైర్మన్ శివసేనారెడ్డి,సలహా దారు జితేందర్ రెడ్డి పాల్గొన్నారు.