- దశల వారీగా నిర్మించి పంపిణీ
- గత పాలనలో హౌసింగ్ శాఖ నిర్వీర్యం
- 326 మంది ఉద్యోగుల పునర్నియామకంతో ఆ శాఖ బలోపేతం
- రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి
ముద్ర, తెలంగాణ బ్యూరో : వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తోందన్న ఆయన సర్కార్ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలని ఉద్యోగులకు సూచించారు. ఆదివారం మినిస్టర్ క్వార్టర్స్ లో తెలంగాణ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఉద్యోగుల డైరీ, క్యాలండర్ ను మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పేదలకు ఇండ్లు నిర్మించే హౌసింగ్ శాఖను గత ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ఆ విభాగాన్ని మూసివేసి ఉన్న ఉద్యోగులను ఇతర శాఖలలో విలీనం చేసిందని విమర్శించారు. తర్వాత అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్క అడుగు వేస్తూ ఈ శాఖను పునరుద్ధరించిందన్నారు. అలాగే లబ్దిదారుల ఎంపిక నుంచి ఇండ్ల నిర్మాణం,పర్యవేక్షణ వరకు అవసరమైన యంత్రాంగాన్ని సమకూర్చుకుందని వివరించారు. 326 మంది ఉద్యోగులను తిరిగి నియమించడం ద్వారా హౌసింగ్ కార్పొరేషన్ను బలోపేతం చేశామన్నారు.
ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పే దవారి జీవితంలో వెలుగులు నింపేందుకు తమప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఆరు గారెంటీలు పథకాలలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లక్షలాది మంది నీడలేని పేదలకు రూ. ఐదు లక్షల పథకంతో పక్కా గృహాలు నిర్మించే కృతనిశ్చయంతో ఉందన్నారు. దానికి గృహనిర్మాణ సంస్థ సిబ్బంది సహకరించాలని,మరింత కష్టపడి పని చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గవ్వ రవీందర్ రెడ్డి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొగ్గుల వెంకట రామిరెడ్డి,సీనియర్ నాయకులు కంది రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.