కరీంనగర్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
ముద్ర , కరీంనగర్ : కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో మహిళలు కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీయూసీసీ (TUCC) కేంద్ర కమిటీ సభ్యులు, యూనియన్ గౌరవ అధ్యక్షులు బండారి శేఖర్ నాయకత్వం వహించారు.

ఈ సందర్భంగా బండారి శేఖర్ మాట్లాడుతూ మహిళలు మహిళా దినోత్సవం స్ఫూర్తితో తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం ద్వారా మహిళలకు అనేక హక్కులు కల్పించినప్పటికీ, సమాన పనికి సమాన వేతనం ఇప్పటికీ అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు, అకృత్యాలు, అత్యాచారాలు జరుగుతున్నాయన్న విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు.
మహిళా దినోత్సవం రోజునే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచడం దురదృష్టకరమని విమర్శించారు. మహిళల పట్ల ప్రభుత్వాలు ప్రకటనలు, వాగ్దానాలకే పరిమితం అవుతున్నాయని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని, మధ్యవర్తి ఏజెన్సీలను రద్దు చేసి నేరుగా కార్మికులకు వేతనాలు చెల్లించే విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ హాస్పిటల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు పి. అరుణ్, నాయకులు శారదా, పద్మ, అరుణ, సకీనా బేగం, రజియా, మమత, సుకన్య, శ్వేత, లావణ్య తదితరులు పాల్గొన్నారు.