Take a fresh look at your lifestyle.

బీఆర్​ఎస్​ నుంచి నేర్చుకోవాల్సింది ఏమీ లేదు – సీఎం రేవంత్​ రెడ్డి

  • బీజేపీ ఆరోపణలపై దృష్టిపెట్టాల్సిన అవసరం లేదు
  • బీజేపీ ఆలోచనలనే బీఆర్​ఎస్​ అమలు చేస్తోంది
  • తెలంగాణ‌లో చట్టం త‌న పని తాను చేసుకుంటుంది
  • గత ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్​ కార్యాలయాలపై దాడులు జరిగాయి
  • దేశ స్వాతంత్ర్యంలో ఆర్​ఎస్​ఎస్​ పాత్ర లేదు
  • దేశం కోసం వాళ్లు ఏ త్యాగమూ చేయలేదు
  • ఆర్ఎస్ఎస్‌తో త‌మ‌ది సిద్ధాంతపరమైన వైరుధ్యం
  • స్వాతంత్య్రానికి వ్య‌తిరేకంగా మాట్లాడే వారిపై చ‌ర్య‌లు తీసుకోవాలి…
  • మోహ‌న్ భాగ‌వ‌త్ పై మోదీ చ‌ర్య‌లు తీసుకుంటారా?
  • ఢిల్లీ నుంచి దేశ ప్రజలకు దిశ నిర్దేశం చేస్తాం
  • ప్రపంచంలోనే మేటి దేశంగా తీర్చిదిద్దుతాం
  • ఢిల్లీలో ఏఐసీసీ పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్​ రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నుంచి తాము నేర్చుకోవాల్సినంతగా ఏమీ లేదనీ అలాగే బీజేపీ నేతలు చెబుతున్న విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన పని కూడా లేద‌ని సీఎం రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ అనేది బీ ఆర్‌ఎస్‌ఎస్ అని, ఆర్ఎస్ఎస్ ఐడియాల‌జీతో వెళ్లేందుకు ఆ పార్టీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ చేసే ఆరోప‌ణ‌ల‌నే తెలంగాణ‌లో బీఆర్ఎస్ చేస్తోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. రాష్ట్రంలో చట్టం త‌న పద్ధతిలో నడిచేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్రయత్నిస్తోంద‌న్న ఆయన ఎక్కడైనా, ఎవరిపైనైనా దాడులు జరిగితే పోలీసులు చర్యలు చేపడతార‌ని పునరుద్ఘాటించారు.

శాంతి భద్రతల సమస్య తలెత్తితేనే పోలీసులు క్రిమినల్‌ కేసులు నమోదు చేశార‌ని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వం హ‌యంలో పోలీసులతో కలిసి బీఆర్ఎస్ వాళ్లు కాంగ్రెస్‌ కార్యాలయాలపై దాడులు చేశార‌న్నారు. కానీ తాము అలా చేయ‌డం లేద‌ని రేవంత్ రెడ్డి చెప్పారు. ఎక్కడైనా తప్పు జరిగితే దానిని సరిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంద‌ని వ్యాఖ్​యానించారు. బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ నూత‌న కార్యాల‌యం ప్రారంభోత్స‌వంలో పాల్గొన్న సీఎం… అక్కడ మీడియాతో మాట్లాడారు. రాహుల్‌ గాంధీ చెప్పిన‌ట్లు ఆర్ఎస్ఎస్‌తో త‌మ‌ది సిద్ధాంతపరమైన వైరుధ్య‌మ‌న్నారు. (ఐడియాలాజికల్‌ డిఫరెన్సెస్‌) స్వాతంత్య్రం కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ ఏ పోరాటం చేయ‌లేద‌నీ వారెవ‌రూ ఎటువంటి త్యాగాలు చేయలేద‌ని రేవంత్ రెడ్డి చెప్పారు.

స్వాతంత్య్రం గురించి ప్ర‌శంసించేందుకు, చెప్పేందుకు వారు సిద్ధంగా లేర‌ని సీఎం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వాళ్ల వాస్తవ సిద్ధాంతమే అద‌ని, మోహన్ భాగవత్ (ఆర్ఎస్ఎస్ స‌ర్ సంఘ‌చాల‌క్‌) అదే చెప్పార‌ని, స్వాతంత్య్ర పోరాటంతో వాళ్లకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ, నేతలు త్యాగాలు చేసి స్వాతంత్య్రం తీసుకొచ్చార‌ని, దేశాన్ని ముందుకు నడిపించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంద‌ని రాహుల్ గాంధీ చెప్పార‌ని సీఎం వివ‌రించారు. స్వాతంత్య్రానికి విరుద్ధంగా ఎవరైనా మాట్లాడితే వారిపై చట్టపరమైన విచారణ చేయాల‌ని, ఆ క్ర‌మంలోనే మోహన్ భాగవత్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశార‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ వాళ్లు త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేయ‌డంలో దిట్ట‌ల‌ని, అందుకే తాము భారతీయ ఝూటా (అబ‌ద్ధాలు) పార్టీ అంటున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

బీజేపీ చెబుతున్న విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన పని లేద‌ని సీఎం అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ మోహన్ భాగవత్‌తో ఉన్నారా లేక దేశ స్వాతంత్య్రం కోసం అమరులైన లక్షలాది వెంట ఉన్నారా అనేది స్పష్టం చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ నేత‌లు కాంగ్రెస్‌ పై ఆరోపణలు చేస్తూ స్వాతంత్య్రం విష‌యంలో మోహన్ భాగవత్ మాట్లాడిన అంశాన్ని త‌క్కువ చేసే ప్రయత్నం చేస్తున్నార‌ని సీఎం ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ విష‌యంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ మోహన్ భాగవత్‌పై చర్యలు తీసుకుంటారా లేదా దేశ ప్రజలకు స్పష్టం చేయాల‌ని సీఎం డిమాండ్ చేశారు.

దేశ ప్ర‌యోజ‌నాల‌కు వేదిక‌…

ఏఐసీసీ నూత‌న కార్యాల‌యం దేశ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌కు వేదిక కాబోతోంద‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేశ ప్రగతి కోసం ప్రణాళికలు సిద్ధం చేసే కార్యాలయాన్ని కాంగ్రెస్ నిర్మించుకుంద‌న్నారు. ఈ కార్యాల‌యం నుంచే దేశాన్ని బలమైన, శక్తిమంత‌మైన దేశంగా మార్చడానికి ప్రణాళికలు రచిస్తుంద‌న్నారు. కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్ ద్వారా దేశానికి రాజ్యాంగాన్ని అందించింద‌న్నారు. ఆ రాజ్యాంగ స్ఫూర్తితో పేద ప్రజ‌లు.. ముఖ్యంగా ఆదివాసీలు, దళితులు, బలహీన వర్గాలు, మైనారిటీల సంక్షేమానికి, అభివృద్ధికి పాటుపడుతోంద‌ని సీఎం తెలిపారు. 140 సంవ‌త్స‌రాల కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవ‌త్స‌రాల త‌ర్వాత సొంత కార్యాలయాన్ని నిర్మించుకుంద‌న్నారు. ఇన్ని సంవత్సరాలు దేశాన్ని నడిపించిన‌ కాంగ్రెస్ పార్టీ ఎంత నిస్వార్థంగా ఇన్ని రోజులు ప్రజలకు సేవలు అందించింద‌నేందుకు ఇదే నిదర్శన‌మ‌న్నారు. 140 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆర్థిక స్థితిగతులను, 40 ఏళ్ల భారతీయ జనతా పార్టీ, ఇత‌ర ప్రాంతీయ పార్టీల ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో దేశ ప్ర‌జ‌లంద‌రికీ తెలుస‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ నూత‌న కార్యాల‌యం నుంచే దేశాన్ని ఇరవై ఒకటో శతాబ్దంలో ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలో ప్ర‌ణాళిక‌లు రూపొందుతాయ‌ని సీఎం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నూత‌న కార్యాల‌యం ప్రారంభించుకున్న రోజు దేశ ప్ర‌జ‌ల‌కు పండ‌గ రోజ‌ని, దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన పార్టీ ఒక అద్భుతమైన కార్యాలయాన్ని నిర్మించుకొని ప్రారంభించుకున్న రోజు అని సీఎం అన్నారు.

Leave A Reply

Your email address will not be published.