Take a fresh look at your lifestyle.

కార్మికుల ఐక్యతతో మెరుగైన వేతన ఒప్పందం

ముద్ర ప్రతినిధి, మెదక్:
సీఐటీయూ చొరవ కార్మికుల ఐక్యమత్యం ద్వారా మెరుగైన వేతన ఒప్పందం సాధ్యమైందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశం అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం చిన్న శివనూరు శివారులోని నియాపోలి పరిశ్రమ కార్మికుల వేతన ఒప్పందంపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సంగారెడ్డి వద్ద శుక్రవారం సంతకాలు పూర్తయిన సందర్భంగా ఏ.మల్లేశం మాట్లాడారు. కార్మికుల వేతన ఒప్పందం గడువు 2026 మార్చి 31తో పూర్తి కాగా ఏప్రిల్ నెలలో యాజమాన్యంతో ఏప్రిల్ 12న వేతన ఒప్పందంపై చర్చలు జరిగినాయన్నారు. ఆ ఒప్పందం ప్రకారం కార్మికులకు నెలకు గరిష్టంగా 7080 రూపాయలు, కనిష్టంగా 6000 రూపాయల వేతనం పెంపుదల, నెలకు 30 రూపాయల సర్వీస్ వెయిటేజ్, 1982 సిరీస్ ప్రకారం వి.డి. ఏ 7 రూపాయల నుండి 8 రూపాయలకు పెంపుదల, ముగ్గురు క్యాజువల్ కార్మికులను పర్మనెంట్ చేయడం కోసం ఒప్పందం కుదిరిందన్నారు.జిల్లా లో చాలా పరిశ్రమల్లో నెలల తరబడి చర్చలు జరిగే సాంప్రదాయం ఉండగా సీఐటీయూ ఒకే దఫా చర్చలు చేసి ఒప్పందం చేయడం జిల్లాలోనే రికార్డు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల ఒక వైపు 12 గం.ల పని విధానం,ఉన్న కార్మికుల్నే కాంట్రాక్ట్ కార్మికులు గా మారుస్తుంటే ఉన్న క్యాజువల్ కార్మికులను పర్మినెంట్ చేసే చరిత్ర సీఐటీయూదే అని అన్నారు. జిల్లాలో అనేక పరిశ్రమల్లో ఎప్పుడో నిర్ణయించిన కనీస వేతనాలు అమలు చేయకపోవడం, ఇ.ఎస్. ఐ, పి.ఎఫ్, బోనస్ లాంటి సౌకర్యాలు కల్పించడం లేదని ఏ.మల్లేశం అన్నారు.కేంద్రం ప్రభుత్వం పాత చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్స్ తీసుకురావడం ద్వారా ప్రైవేట్ యాజమాన్యాలు మరింత రెచ్చి పోయి కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు.హక్కుల కోసం యూనియన్స్ ఏర్పాటు చేసుకుని పోరాడటమే అంతిమ పరిష్కారం అని అన్నారు. పోరాడే కార్మికులకు సీఐటీయూ పూర్తి అండగా నిలుస్తుందని అన్నారు. వేతన ఒప్పందంపై యజమ్యం తరపున పరిశ్రమ యజమాని దక్షిత్ మోర్, ప్రతినిధి ఆదర్శ్, నియాపోలి ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ యూనియన్ సీఐటీయూ తరపున జిల్లా కార్యదర్శి ఆ యూనియన్ అధ్యక్షులు ఏ.మల్లేశం ,ప్రధాన కార్యదర్శి కె.నవీన్, ఉపాధ్యక్షులు మురళి గౌడ్, సహాయ కార్యదర్శి మహేష్, కోశాధికారి శేఖర్, కార్మిక శాఖ తరపున డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ రవీందర్ రెడ్డి సంతకాలు చేశారు.

Leave A Reply

Your email address will not be published.