- కుంభకోణాల్లో ఇరుక్కుపోయి కేసులు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్
- కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించే పరిస్థితి జీహెచ్ఎంసీకి లేదు
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అవినీతి రహిత పాలన రావాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి రావల్సిన అవసరం ఉందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో పెరుగుతోన్న అవినీతి అక్రమాలకు బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీలేనని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ అవినీతి కుంభకోణాల్లో ఇరుక్కుపోయి కేసులను ఎదుర్కొంటుందని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పాలన సాగుతుందని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేళ్ళ నిర్భంద పాలన, 11 నెలల కాంగ్రెస్ పాలన చూశామన్నారు. ఈ మేరకు ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి కిషన్ రెడ్డి ఆహ్వానించారు.
అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ లో పనులు చేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చే పరిస్థితి జీహెచ్ ఎంసీకి లేదన్నారు. జీహెచ్ఎంసీలో వీధిలైట్ల రిపేర్లకు 7 నెలల నుంచి నిధులు లేవని, లిక్కర్ సరఫరా చేసిన కంపెనీలకు కూడా డబ్బులిచ్చే పరిస్థితి లేదనే దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చారని ఆయన మండిపడ్డారు. ప్రపంచ దేశాలన్ని ఆర్ధిక సంక్షోభమంలో కొట్టుమిట్టాడుతుంటే, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత దేశం ఆర్ధికంగా పురోగమిస్తోందని అన్నారు ఒక్క రూపాయి అవినీతి లేకుండా ప్రధాని మోడీ పాలన సాగిస్తున్నారన్నారని కొనియాడారు. భారత రాజ్యాంగం మీద పోరాడలన్న రాహుల్ గాంధీకి సిగ్గు ఉండాలన్నారు. తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదన్నారు. ఆరు గ్యారంటీలు ఇచ్చిన తర్వాతే తెలంగాణకు రాహుల్ రావాలని, రాజ్యాంగాన్ని, అంబేడ్కర్ ను అవమానించిన పార్టీ కాంగ్రెస్ అని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. పీవీ నర్సింహారావుని అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని అన్నారు.