మేడిగడ్డపై ప్రభుత్వ పెద్దల దుష్ప్రచారం ఎమ్మెల్సీ కవిత
పెద్దపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న కవిత
ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావాలని బీఆర్ఎస్ నాయకురాలు, ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత ఎదురు ప్రశ్న వేశారు. పెద్దపల్లిలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆమె ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చక్కనైన, నిజాయితీగా, ప్రజలకు పనికొచ్చే పని చేస్తే కచ్చితంగా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని, ప్రభుత్వాన్ని అడుగుతారు, కడుగుతారు అని అన్నారు. కానీ ప్రతీ ఒక్క వర్గాన్నిప్రభుత్వం నడిపిస్తున్నపెద్దలు మోసం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్ని ప్రభుత్వం విస్మరించిందని, రాజ్యాంగంపై ప్రమాణం చేసి జనవరి 26న రాత్రి రైతు బంధు నిధులు విడుదల చేస్తామన్న ముఖ్యమంత్రి ఇప్పటి వరకు విడుదల చేయలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇవ్వకుండా మొత్తం తెలంగాణను ఎండబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ మీద అక్కసుతో తెలంగాణ రైతాంగం నోట్లో మట్టికొడుతున్నారన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తక్షణమే మేడిగడ్డ ప్రాజెక్టును పురుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, పుట్ట మధు, తదితరులు పాల్గొన్నారు.