సమస్యాత్మక ప్రాంతాలను సందర్శించి తక్షణ మరమ్మతులు చేపట్టండి
తాగునీటి సరఫరా విభాగం అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాలు
(ముద్ర ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి) : రానున్న వేసవిలో జిల్లాలో ఎక్కడ కూడా నీటి ఎద్దడి ఏర్పకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో వివిధ శాఖల జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నీటి ఎద్దడి నెలకొన్న ప్రాంతాలను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మిషన్ భగీరథ, మెట్రో వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పైప్ లైన్లు మరమ్మత్తులు చేయించి నీటి ఎద్దడిని నివారించాలన్నారు. వేసవి కాలంలో నీటి సరఫరాలో సమస్యలు ఎక్కడ ఉత్పన్నమవుతాయో గుర్తించి పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. లీకేజీ మరమ్మతులు ఏమైనా ఉంటే వాటిపై దృష్టి పెట్టి ఎక్కడ త్రాగునీటి సరఫరాలో సమస్యలు రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీ పరిధిలో మండల మున్సిపల్ పరిధిలో అధికారులు సమన్వయంతో పనిచేసే రాబోయే వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ప్రణాళిక బద్ధంగా పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా నీటి పంపులు, మోటర్లు, వాల్స్ లు పైపులకు సంబంధించి మరమ్మతులు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆయా గ్రామాలను నీటి సరఫరా అధికారులు సందర్శించి అందుకు కావలసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని తెలిపారు. నీరు వృధా కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో గ్రౌండింగ్ అయిన పనులు పెండింగులో ఉంటే వెంటనే పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, మండల తహశీల్దారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.