జిల్లాలో 10వ తరగతి పరీక్షల ప్రశ్నపత్రాల మూల్యాంకనం నేటి నుంచి ప్రారంభమవుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) ఏ. రమేష్ కుమార్ తెలిపారు.
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
ఈ మూల్యాంకన ప్రక్రియను మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 23 వరకు మొత్తం 23 రోజుల పాటు 1,72,190 ప్రశ్నపత్రాలను మూల్యాంకనం చేయనున్నారు. జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు డీఈఓ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలు 34 రోజుల పాటు నిర్వహిస్తున్నందున మూల్యాంకనాన్ని కూడా మూడు విడతలుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మొదటి విడతలో ఏప్రిల్ 1 నుంచి 9 వరకు తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితశాస్త్రం సబ్జెక్టుల మూల్యాంకనం జరుగుతుందని, రెండో విడతలో ఏప్రిల్ 10 నుంచి 17 వరకు భౌతికశాస్త్రం, జీవశాస్త్రం సబ్జెక్టుల మూల్యాంకనం నిర్వహించనున్నట్లు చెప్పారు. మూడో విడతలో ఏప్రిల్ 17 నుంచి 23 వరకు సాంఘిక శాస్త్రం ప్రశ్నపత్రాల మూల్యాంకనం చేపడతామని వివరించారు.
మూల్యాంకనం నిర్వహణకు 92 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 554 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 162 మంది స్పెషల్ అసిస్టెంట్లను నియమించినట్లు తెలిపారు. ప్రతి సబ్జెక్టుకు ఇద్దరు చొప్పున 16 మంది ప్రత్యేక అధికారులను నియమించామని పేర్కొన్నారు. క్యాంప్ ఆఫీసర్గా డీఈఓ రమేష్ కుమార్, అదనపు క్యాంప్ ఆఫీసర్గా కురుమయ్య, ఎగ్జామినర్గా రాజశేఖర్ రావు బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు తెలిపారు.
మూల్యాంకనం కేంద్రంలో బెంచీలు, ఫ్యాన్లు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి అన్ని సౌకర్యాలను కల్పించినట్లు తెలిపారు. ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రతి ఉపాధ్యాయుడికి రోజుకు 40 ప్రశ్నపత్రాలు కేటాయించి, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూల్యాంకనం నిర్వహించనున్నట్లు వివరించారు.
మూల్యాంకనం విధులకు ఆర్డర్లు పొందిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలని, హాజరు కాకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీఈఓ హెచ్చరించారు.